
కరోనా కారణంగా భారతదేశంలో అన్ని రంగాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చివరికి ఆధ్మాత్యిక రంగంపైనా పెను ప్రభావం పడింది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద వేడుక పూరీ జగన్నాథ రథయాత్రను ఎలా నిర్వహించాలా అన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఇదే సమయంలో ప్రజల్లేకుండా జగన్నాథ రథయాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టును కోరింది. ఈ వేడుక నిర్వహణపై ఇచ్చిన స్టేను సవరించాలని దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
మరోవైపు భారత ప్రభుత్వ వాదనకు ఒడిషా ప్రభుత్వం సైతం మద్ధతుగా నిలిచింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ అంశంపై లోతైన విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
Also Read:పూరీ జగన్నాథుని రథ చక్రాలకు సుప్రీం కరోనా బ్రేకులు
విచారణ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ వేడుక ప్రజల విశ్వాసానికి సంబంధించినదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
జూన్ 23న ఈ వేడుక నిర్వహించలేకపోతే.. సంప్రదాయం ప్రకారం మరో 12 ఏళ్ల పాటు రథయాత్రను వాయిదా వేయాల్సి వుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రథయాత్ర నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని.. అవసరమైతే ఒకరోజు కర్ఫ్యూ కూడా విధించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
అనాదిగా రథయాత్రలో భాగం అవుతున్న కుటుంబాలకు చెందిన 600 మంది సేవకులు మాతరమే యాత్ర నిర్వహణను చూసుకుంటారని తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
కాగా కరోనా కారణంగా పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని సుప్రీంకోర్టు జూన్ 18న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవిడ్ 19 వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే అవకాశం వున్నందున రథయాత్ర నిర్వహించడం శ్రేయస్కరం కాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.