
న్యూఢిల్లీ: అసోంలో బీభత్సమైన వరదలు వచ్చాయి. లక్షలాది మంది ఈ వరదలతో ప్రభావితం అయ్యారు. వందకు మించి మరణాలు సంభవించాయి. వీటికితోడు రోజువారీ జీవితం భారంగా మారింది. విద్యుత్ సహా అన్ని సదుపాయాలు నిలిచిపోయాయి. రోజు గడవడమే కష్టంగా ఉన్నది. శనివారం నాటికి ఆరు రోజులపాటు సిల్చార్ టౌన్ నీట మునిగే ఉన్నది. సుమారు వారం రోజులు నీటిలోనే మునిగి ఉండటంతో తిప్పలు ఎక్కువ అయ్యాయి.
కాచార్ జిల్లాలోని సిల్చార్ టౌన్ ప్రజలు ఇప్పటి వారం రోజుల నుంచి భూమిని చూడలేదు. చుట్టూ వరదల నీటినే చూస్తు ఉన్నారు. శనివారం నాటికి అసోంలో ఈ వరదల కారణంగా 122 మంది మరణించారు. కాగా, సుమారు 25.10 లక్షల మంది వరదలతో ప్రభావితం అయ్యారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ లెక్కల ప్రకారం, రాష్ట్రంలోని 28 జిల్లాల్లో శుక్రవారం నాటికి ఈ వరదల కారణంగా 33.03 లక్షల మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. శనివారం నాటికి వీరి సంఖ్య 25.10 లక్షల మందికి తగ్గింది. ఇప్పుడు వరదలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇంకా పెద్ద సంఖ్యలో జనాలు మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పలు నదుల్లో నీటి ప్రవాహ మట్టాలు తగ్గుతున్నాయి. అయితే, బ్రహ్మపుత్ర, కోపిలి నదులు మాత్రం ధుబ్రి, నగావ్లలో ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలతో పరుగులు పెడుతున్నాయి.
కాగా, రెండు డ్రోన్లు సిల్చార్లో ఆహారాన్ని సప్లై చేస్తున్నాయి. రిలీఫ్ మెటీరియల్నూ అందిస్తున్నాయి. అలాగే, చెన్నై నుంచి వచ్చిన ఓ టీమ్ సీఎం ఆదేశాల మేరకు వాటర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.
తాగు నీటి కొరతపై డెక్కన్ హెరాల్డ్ కీలక కథనం వెలువరించింది. బిజు దాస్ అనే వ్యక్తి ఇల్లు సిల్చార్ టౌన్లో సొనాయ్ రోడ్ వద్ద ఉన్నది. జూన్ 20వ తేదీ నుంచి ఆయన నివాసం నీట మునిగే ఉన్నది. ఇంటిలో ఇన్వర్టర్ కూడా నీటిలో మునిగిపోయింది. సోమవారం నుంచి పవర్ లేకుండా పోయింది. కాబట్టి, తాగు నీరు లేకుండా పోయింది. భుజాల లోతుతో ఉన్న వరద ప్రవాహం కారణంగా బయటకు వెళ్లి తాగు నీరు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. చివరకు శుక్రవారం తాను ఒక కిలోమీటరు దూరం ప్రయాణించి తాగు నీరు కొనుగోలు చేశానని బిజు దాస్ తెలిపారు. సాధారణ సమయాల్లో రూ. 20కి లభించే వాటర్ బాటిల్ను రూ. 100కు అమ్ముతున్నారని, ఇంకొన్ని చోట్లలో రూ. 150కు అమ్ముతున్నారని వివరించారు. తనకు మరో దారి లేకపోయిందని, రెండు వాటర్ బాటిళ్లు తీసుకున్నాని పేర్కొన్నారు. ఈ ధర లీటర్ పెట్రోల్ కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం.
వారం రోజులు వరద నీటిలోనే ఉన్న సిల్చార్ టౌన్లో కొందరు మరణించారు కూడా. వారికి అంతిమ క్రియలు నిర్వహించడం కూడా సవాల్గా మారింది. వరద నీరే నిలిచి ఉండటంతో ఆప్తులను ఖననం చేయడానికీ కనీసం భూమి కనిపించలేదని ఐఏఎన్ఎస్ శనివారం ఓ రిపోర్టులో పేర్కొంది. నిర్జీవంగా మారిన ఆప్తుల దేహాలను చూస్తూ ప్రజలు తమ నివాసాల్లో గడిపిన వారు ఉన్నారని తెలిపింది. సహాయం కోసం ఆశగా చూస్తూ గడుపుతున్నారని పేర్కొంది. కాగా, కొందరు మాత్రం ఆ డెడ్ బాడీలను మేక్ షిఫ్ట్ బోట్లలో వేసుకుని ఖననం చేయడానికి భూమి కోసం గాలింపులు చేస్తున్నట్టు వివరించింది.