
UP Assembly Election 2022: ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు కాకా రేపుతున్నాయి. బులంద్షహర్ లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. ఇదే ప్రాంతం నుంచి లాలు ప్రసాద్ యాదవ్ అల్లుడు కూడా తన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జిల్లాలో సయానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న పూనమ్ పండిట్ వయస్సు కేవలం 25 సంవత్సరాలు.. ఇక్కడి ఎన్నికల పోటీలో నిలిచిన అతి పిన్న వయస్కురాలు ఆమె కాగా, షికార్పూర్ స్థానం నుంచి ఆర్ఎల్డీ నుంచి బరిలోకి దిగుతున్న కేబినెట్ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రొఫెసర్ కిరణ్ పాల్ సింగ్ వయస్సు 74 సంవత్సరాలు. ఎన్నికల బరిలో నిలిచిన అత్యంత వయోవృద్ధుడు.
రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డి) మద్దతుతో సికింద్రాబాద్ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) టికెట్పై పోటీ చేస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు రాహుల్ యాదవ్.. బులంద్షహర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడు (ఆయన ఆస్తులు రూ.62 కోట్లు). ఈ సారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఈ ఎన్నికల్లో ఏడుగురు బీజేపీ అభ్యర్థుల్లో నలుగురు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. వీరిలో ఖుర్జా నుండి మీనాక్షి సింగ్, సికింద్రాబాద్ నుండి లక్ష్మీరాజ్ సింగ్, బులంద్షహర్ సదర్ నుండి ప్రదీప్ చౌదరి, దిబాయి నుండి చంద్రపాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఖుర్జా నుంచి బన్సీ సింగ్ పహారియా, అనుప్షహర్ నుంచి చౌదరి గజేంద్ర సింగ్, సియానా నుంచి దిల్నవాజ్ ఖాన్, షికార్పూర్ స్థానం నుంచి ప్రొఫెసర్ కిరణ్ పాల్ సింగ్ బరిలో ఉన్నారు.
బులంద్షహర్ లోని పరిధిలోని స్థానాల్లో ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ అభ్యర్థుల సగటు వయసు 50 ఏండ్లుగా ఉంది. అయితే, ఖుర్జా నుంచి పోటీ చేస్తున్న మీనాక్షి సింగ్ వయసు 32 ఏళ్లు కాగా, సయానా నుంచి రెండోసారి పోటీ చేస్తున్న దేవేంద్ర సింగ్ లోధి వయసు 60 ఏళ్లు. ఆస్తుల విషయానికి వస్తే.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో లాలు ప్రసాద్ యాదవ్ అల్లుడు అత్యంత సంపన్న అభ్యర్థిగా ఉన్నారు. సికింద్రాబాదు స్థానం నుంచి రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు.. రాహుల్ యాదవ్, ఎస్పీ శాసన మండలి సభ్యుడిగా ఉన్న జితేంద్ర యాదవ్ కుమారుడు రూ.62 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు.
క్రిమినల్ కేసుల విషయానికి వస్తే.. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో ఆర్ ఎల్ డీ టికెట్ పై బులంద్ షహర్ సదర్ నుంచి పోటీ చేస్తున్న హాజీ యూనస్ పై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, రాష్ట్ర మంత్రి అనిల్ శర్మ, బీఎస్పీకి చెందిన సియానా అభ్యర్థి సునీల్ భరద్వాజ్ లపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో బీఎస్పీ అభ్యర్థి రఫీక్, ఎస్పీ ఖుర్జా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బన్సీ సింగ్ పహాడియాపై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.