
Tejashwi Yadav: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల మద్యపానానికి వ్యతిరేకంగా అవగాహన యాత్రను ప్రారంభించారు. తాగుబోతులను భారతీయులు కాదని, 'మహాపాపులు'గా అభివర్ణిస్తూ.. వారిని భారతీయులుగా తాను భావించనని సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. మద్యం సేవించే భారతీయ సైనికులను కూడా మహా పాపులని, భారతీయులు కాదని సీఎం నితీశ్ భావిస్తున్నారా? అని యాదవ్ ట్విట్టర్లో నితీష్ను ప్రశ్నించారు.
"నితీష్ కుమార్ లాజిక్ ప్రకారం, తాగే భారతీయ సైనికులు కూడా హిందుస్తానీ కాదు. ప్రత్యర్థుల రక్తం కళ్ల చూసే నేరస్థులు, అవినీతిపరులు 'మహాపాపి' లేదా మహా యోగ్య కాదు. కానీ, మద్యం తాగేవారు పాపులు, సైనికులు కూడా భారతీయులు కాదు అని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
సీఎం నితీష్ కుమార్ బుధవారం బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడుతూ.. మద్యం సేవించేవారు 'మహాపాపులు, హిందుస్తానీలు కాదని అన్నారు. బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్, 2016కి ప్రతిపాదించిన సవరణలపై చర్చలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని, ఆయన సిద్దాంతాలను ఉల్లంఘించి మద్యం సేవించే వారు 'మహా పాపులు' అని అన్నారు. కల్తీ మద్యం సేవించి మరణిస్తే ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోదని తేల్చి చెప్పారు. మద్యం తాగితే ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా ప్రజలు అటు వైపు వెళ్తున్నారని అన్నారు. కాబట్టి, వాటి వల్ల తలెత్తే పరిణామాలకు వారే బాధ్యత వహించాలని, అలాంటి కుటుంబాలకు మేము ఎటువంటి నష్టపరిహారం ఇవ్వమని, మద్యం వ్యాపారులు చట్టంలో సవరణల తర్వాత కఠినమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని నితీశ్ స్పష్టం చేశారు.
గడిచిన ఆరు నెలల్లో బిహార్లో కల్తీ మద్యం తాగిన ఐదారు ఘటనల్లో కనీసం 60 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే సీఎం నితీశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బిహార్లో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించారు. బీహార్లోని బక్సర్ జిల్లా దుమ్రావ్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మరణించారు. కల్తీ మద్యం తాగిన మరో నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఐదుగురు deathపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
బీహార్లోని సరన్ జిల్లాలోనూ కల్తీ మద్యం తాగడం వల్ల ఐదుగురు మరణించిన ఘటన జరిగిన వారంలోపే మరో విషాదం జరిగింది. దానికి వారం రోజుల ముందు నలంద జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. గత ఏడాది కల్తీ మద్యం తాగి 40 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దర్యాప్తునకు ఆదేశించారు.