
ఒడిశాలోని బాలాసోర్లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్-అగర్తల ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్-అగర్తల ఎక్స్ప్రెస్లోని ఓ బోగీలోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుండి పొగలు వెలువడటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. వెంటనే పొగలను అదుపు చేశారు.
అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటన చోటుచేసుకుంటుందనే భయంతో కొందరు ప్రయాణికులు బోగీ ఎక్కేందుకు నిరాకరించారు. పొగలు వెలువడిన బోగీని మార్చాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో 45 నిమిషాల తర్వాత రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది.
Also Read: Odisha Train Accident: అయ్యో పాపం.. ఇప్పటికీ గుర్తించని 101 మంది మృతదేహాలు
‘‘బ్రహ్మపూర్ స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్-అగర్తల ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ B-5లో చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ తలెత్తింది. డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించారు’’ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెలిపారు.