
Mud Mound Collapse: దీపావళి పండగ నేపథ్యంలో తమ ఇండ్లకు పూయడానికి మట్టిని తీసుకురావడానికి వెళ్లిన వారిపై ఒక్కసాగిగా మట్టిదిబ్బ కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు బాలికలు సహా ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. మరో నలుగుగురు గాయపడ్డారు. రాజస్థాన్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్లోని కరౌలీ జిల్లాలోని సపోత్రా సబ్డివిజన్లోని సిమిర్ గ్రామంలో మట్టి దిబ్బ కూలి ఆరుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మరో మహిళతో పాటు ఇద్దరు బాలికలు కూడా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితులను పరిశీలించారు.
సపోత్రా సబ్డివిజన్లోని సిమర్ గ్రామ పంచాయతీ మేడ్పురా గ్రామానికి చెందిన మహిళలు, బాలికలు మధ్యాహ్నం తమ పొలాల వైపు వెళ్తున్నారు. ఆపై చదును చేయని రోడ్డు గుండా వెళుతుండగా ఒక్కసారిగా మట్టి కుప్ప కూలిపోయిందని స్థానికులు పేర్కొన్నారు. శిథిలాల మధ్య సమాధి కావడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరింత మంది మట్టిదిబ్బ కింద ఉన్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, దీపావళికి ముందు నివాసితులు తమ ఇళ్లపై పూయడానికి మట్టిని తీసుకురావడానికి వెళ్లారనీ, అకస్మాత్తుగా, మట్టిదిబ్బ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరగిందని ఏఎన్ఐ నివేదించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 15 అడుగుల ఎత్తైన మట్టిదిబ్బ బలహీనంగా మారింది. ఈ క్రమంలోనే వారిపై కూలివుంటుందని స్థానికులు చెబుతున్నారు.
మృతుల్లో గోపాల్ మాలి భార్య రాంనారి, ముగ్గురు కుమార్తెలు మృతి చెందారు. దీంతో పాటు గ్రామానికి చెందిన రాజేష్ భార్య, మరో మహిళ కేశ్వంతి కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మట్టిలో కూరుకుపోయే అవకాశం ఉంది. మట్టిలో కూరుకుపోయిన వారిని రక్షించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని సపోత్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి ఇద్దరు వ్యక్తులను కరౌలీకి రిఫర్ చేశారు. ఇద్దరు రోగుల్లో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు.. విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇదిలావుండగా, రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు బాలురు డ్యామ్లో మునిగిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు చిన్నారులను సజీవంగా బయటకు తీశారు, కానీ డ్యామ్లో మునిగిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం అనంతరం మృతి చెందిన చిన్నారుల ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఇతర పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను స్థానిక ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు. మృతులందరి వయస్సు 18 నుంచి 20 ఏళ్లు ఉంటుందని తెలిపారు.