
ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దూకుడుగా వ్యవహరిస్తోంది. దేశంలో మారుతున్న రాజకీయ యుగంలో ఇప్పుడు విద్యార్హత ప్రభావం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ 'డిగ్రీ దీఖావో' ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ నాయకులను కూడా అదే చేయాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి తీసుకరావాలన్నందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు రూ. 25,000 జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ పరిమాణం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి .." డిగ్రీ దిఖావో" అనే ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. " డిగ్రీ దిఖావో" అనే ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. తన మూడు డిగ్రీలను దేశం ముందు ఉంచాననీ, తాను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి BA, ఆక్స్ఫర్డ్ నుండి రెండు మాస్టర్స్ డిగ్రీలను పొందానని తెలిపారు. తన సర్టిఫికెట్స్ అన్నీ అసలైనని అతిషి అన్నారు. తాను అందరు నాయకులను, ముఖ్యంగా బిజెపి నాయకులను వారి డిగ్రీలు చూపించమని అడగాలనుకుంటున్నానని ఆమె తెలిపారు. ప్రచారంలో భాగంగా ఆప్ నేతలు ప్రతిరోజూ తమ డిగ్రీని బహిరంగపరుస్తారని చెప్పారు. సీనియర్ బిజెపి నాయకులు కూడా తమ డిగ్రీని చూపించాలని ఆమె కోరారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తాను విజ్ఞప్తి చేస్తున్నాననీ, వారు తమ పట్టాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు.
ప్రధాని డిగ్రీపై వివాదం
ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీకి సంబంధించి ఆప్ నేతలు నిరంతరం ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అవినీతి కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా ప్రధాని విద్యార్హతపై గతంలో దేశానికి లేఖ రాశారు. మరోవైపు.. కొన్ని వారాల క్రితం, 11 భాషలలో ప్రధానమంత్రి విద్యార్హతను నిరసిస్తూ.. గోపాల్ రాయ్ పోస్టర్ను విడుదల చేశారు. దీని తర్వాత.. ఈ విషయంపై బిజెపి కూడా ప్రతీకారం తీర్చుకుంది . అవినీతిపరుల సైన్యాన్ని సృష్టించడానికి ఇది AAP యొక్క కొత్త డ్రామా అని, దీని ద్వారా దేశ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని విమర్శించారు.