
నెమ్మదించింది అనుకున్న కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెంది మళ్లీ మానవాళిపై పెను సవాల్ విసురుతోంది. దీని ధాటికి ఎన్నో దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో కరోనా మ్యూటేషన్ జరిగినట్లు నిపుణులు నిర్థారించారు. ఇవి ఆయా దేశాల్లోకి చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి.
భారత్లో యూకే, దక్షిణాఫ్రికా రకం కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ కేసు బయటపడింది. కొన్నిరోజుల కిందట దుబాయ్ నుంచి బెంగళూరులో దిగి అక్కడి నుంచి శివమొగ్గకు వచ్చిన వ్యక్తి (53)కు కొత్త కరోనా సోకినట్లు నిర్ధారించారు.
విదేశాల నుంచి వచ్చిన తర్వాత శివమొగ్గలోని తన ఇంట్లో వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న బాధితుడు తరువాత బయటకు వచ్చి తిరిగాడు. అనుమానంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కొత్త రకం కరోనా అని పరీక్షించగా దక్షిణాఫ్రికాలో ఇటీవల గుర్తించిన స్ట్రెయిన్గా తేలింది. బాధితుడికి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్సను అందిస్తున్నారు.
మరోవైపు భారత్లో గడిచిన 24 గంటల్లో 23,285 కరోనా పాజిటివ్ కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,13,08,846కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. వీటిలో యాక్టివ్ కేసులు సంఖ్య 1,97,237 కాగా, రికవరీ రేటు 96.86గా నమోదయింది.