
ఛత్రపతి శివాజీ మహారాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీశాయి. ఆయన సంచలన వ్యాఖ్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేలారేగుతున్నాయి. బీజేపీని, సీఎం ఏక్నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని శివసేన, ఇతర ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వ్యవహరంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తప్పు పట్టారు. మా తల్లిదండ్రుల కంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కే ఎక్కువ విధేయత చూపుతామని ఓ వీడియో ద్వారా బదులిచ్చారు.
నితిన్ గడ్కరీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో గడ్కరీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి వ్యాఖ్యానించారు. ఈ వీడియో దాదాపు 30 సెకన్ల నిడివితో ఉంది. నితిన్ గడ్కరీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మాట్లాడటం కనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మా దేవుడని నితిన్ గడ్కరీ చెబుతున్నాడు. తల్లిదండ్రుల కంటే ఛత్రపతి శివాజీ మహారాజ్పై ఎక్కువ విధేయత చూపుతాము.ఎందుకంటే ఆయన జీవితమే ప్రతి ఒక్కరికి ఆదర్శమని వ్యాఖ్యానించడం గమనించవచ్చు.
గవర్నర్ కోష్యారీ ఏం అన్నారు?
వేదికపై నుంచి కోశ్యారి మాట్లాడుతూ.. మేం స్కూల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు రోల్ మోడల్ ఎవరు అని అడిగేవారు. అప్పట్లో విద్యార్థులు వాళ్లకు నచ్చేవారి పేర్లు చేప్పేవారు. అందులో చాలామంది సుభాష్ చంద్ర, మరికొందరు నెహ్రూ, మరికొందరు గాంధీజీ పేర్లను చెప్పేవారు. కానీ, నేడు.. విద్యార్థుల ఆదర్శాలను కనుగొనాలనుకుంటే.. బయటికి వెళ్లవలసిన అవసరం లేదు. మహారాష్ట్రలో చాలా మంది ఆరాధ్య నాయకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాతకాలం నాటి ఆరాధ్య దైవం. నేడు యువత నూతన శకం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఆ వేదికపైనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్లకు మరఠ్వాడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగత్ సింగ్ కోశ్యారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఛాన్సలర్గా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ను నితిన్ గడ్కరీ , శరద్ పవార్లతో నేరుగా కోష్యారీ పోల్చారు. అందువల్ల ఈ వివాదం తార స్థాయికి చేరింది.