
నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మహారాష్ట్ర సర్కార్ మరో వివాదానికి తెరలేపింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి వ్యవహరిస్తున్నారని పాలక శివసేన ఆరోపించింది.
గవర్నర్ స్ధానంలో కూర్చున్న వ్యక్తి చేయకూడని రీతిలో ఆయన పనిచేస్తున్నారని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన విమర్శలు గుప్పించింది. రాజ్భవన్ ప్రతిష్టను కాపాడాలాని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావిస్తే గవర్నర్ కోష్యారిని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది.
ఆయన సంఘ్ ప్రచారక్ లేదా బీజేపీ అయ్యుండొచ్చని, కానీ ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ హోదాలో ఉన్నారన్న సంగతిని మరిచిపోకూడదని శివసేన హితవు పలికింది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ లేఖ పంపడం అవాంఛనీయ చర్యగా శివసేన అభివర్ణించింది. కాగా, కొద్దిరోజుల క్రితం ఉద్ధవ్ ఠాక్రేకు ఇటీవల కోష్యారి రాసిన లేఖలో మీరు ఒక్కసారిగా సెక్యులర్గా మారారా అంటూ ప్రశ్నించడాన్ని సేన ప్రస్తావించింది.
సీఎంకు లేఖ రాసిన సమయంపైనా శివసేన మండిపడుతూ కోష్యారి బీజేపీ అజెండాను ముందుకు తీసుకువెళుతున్నారని వ్యాఖ్యానించింది.