మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ థాక్రే

By sivanagaprasad KodatiFirst Published Nov 28, 2019, 6:44 PM IST
Highlights

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. 

ఉద్దవ్‌తో పాటు శివసేన నుంచి ఏక్‌నాథ్ ముండే, సుభాష్ దేశాయ్.. ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్.. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ కేత్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు.

శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఉద్థవ్ వెల్లడించారు. సామ్నా పత్రికను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే 1988లో స్థాపించారు. అప్పటి నుంచి పార్టీకి గొంతుకగా సామ్నా మారిపోయింది.

Also read:సీఎం పదవి పోయింది కానీ రికార్డు మిగిలింది: మహాపాలిటిక్స్ పై నెటిజన్లు

ఈ పత్రిక వ్యవహారాలన్నీ ఇప్పటి వరకు ఉద్ధవ్ థాక్రేనే చూసుకునేవారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో పదవిలో ఉండటం భావ్యం కాదని భావించిన ఉద్థవ్ ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అప్పగించారు. 

ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన అజిత్, తన వర్గం ఎమ్మెల్యేలు  కలిసిరాకపోవడంతో, పవార్‌ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్‌ శరద్‌ పవార్‌ కూడా క్షమించారు, గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు.

ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో​ అజిత్‌ ఏమేరకు సర్దుకుపోతారన్నది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఆయన సీఎం పదవిపై కన్నేసినట్టు వార్తలు వస్తుండటంతో మరోమారు ఏమవుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

పొత్తుల్లో భాగంగా రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని ఎన్సీపీ అడిగితే తప్పేంటని  ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్‌ కామెంట్‌ చేసినట్టు ఎన్సీపీలోని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.  

ఈ పరిస్థితుల మధ్య ఉన్నట్టుండి అజిత్‌ పవార్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ కావడంతో ఒక్కసారిగా మూడు పార్టీల్లోనూ ఆందోళన మొదలయ్యింది. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారానికి  సిద్ధమైన వేళ, అజిత్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకోవడం పలు ఊహాగానాలకు తెరతీసినట్టయ్యింది.  

Also Read:ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవడం వెనుక ఉన్నదీ ఈవిడే...

అయితే, ఈ వ్యవహారంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందిస్తూ, అజిత్‌ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నారని, సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారని తెలిపారు. కాల్స్‌ ఎక్కువగా వస్తుండటంతో ఫోన్‌ స్విచ్చాప్‌ చేశారని క్లారిటీ ఇచ్చారు. 

click me!