
ముంబయి: మహారాష్ట్రలో అజిత్ పవార్ రాజకీయాలు హీటెక్కించారు. ఉన్నట్టుండి శరద్ పవార్కు షాక్ ఇస్తూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అంతేకాదు, ఆయన వర్గీయులకూ మంత్రి పదవులు దక్కాయి. ఈ పరిణామాలు ఇంకా జీర్ణం కాకముందే.. అజిత్ పవార్ మరో ట్విస్ట్ ఇచ్చారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవారే అని పేర్కొన్నారు.
ఎన్సీపీ తిరుగుబాటు నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా పలువురు నేతలు ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ తట్కారే, పార్టీ చీఫ్ విప్గా అనిల్ బాయిదాస్ పటేల్ను నియమిస్తున్నట్టు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు.
అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఎన్సీపీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని, తాము ప్రధాని నేతృత్వంలో ఉన్నట్టు వివరించారు. ఎన్సీపీ గుర్తు, పేరు తమకే చెందుతుందని అన్నారు.
ఇదిలా ఉండగా ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అని మీడియా ప్రశ్నించగా.. ఊహించని సమాధానం చెప్పారు. తమ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ అనే విషయం మరిచిపోయారా? అంటూ సమాధానం ఇచ్చారు.
Also Read: బిహార్లోనూ ‘మహా’ ఆపరేషన్? ఈసారీ పార్టీ చీలికను నితీశ్ అడ్డుకుంటాడా? విపక్షాల ఐక్యతపైనా ఎఫెక్ట్!
అదే సమయంలో ప్రఫుల్ పటేల్ శరద్ పవార్ను ఉద్దేశించి మాట్లాడారు. తమపై అనర్హత వేటు వేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. తమకు శరద్ పవార ఆశీస్సులు కావాలని, ఆయనకు చేతులు జోడించి వేడుకుంటున్నట్టు చెప్పారు. శరద్ పవార్ తమకు గురువు అని వ్యాఖ్యానించారు.