
మహారాష్ట్ర నాగ్పూర్లో (Nagpur) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. Rashtriya Swayamsevak Sangh హెడ్ క్వార్టర్స్తో పాటు, హెడ్గేవార్ భవన్ వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా నాగ్పూర్లో పలు సున్నితమైన ప్రాంతాల్లో జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులపై కొత్వాలి పోలీసులు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం Nagpur క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
‘నాగ్పూర్లోని కొన్ని ప్రదేశాలలో కొంతమంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు మాకు సమాచారం అందింది. మేము చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశాం. ఈ ఘటనను క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది’ అని నాగ్పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ (Amitesh Kumar) తెలిపారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఫోటోగ్రఫీ, డ్రోన్లను ఎగురవేయకుండా అదనపు భద్రతను మోహరించినట్లు అమితేష్ కుమార్ తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించాడని ఆయన నిరాకరించారు.
జమ్మూకశ్మీర్లో నివసిస్తున్న ఒక యువకుడు జూలై 2021లో నాగ్పూర్కు వచ్చి కొంతకాలం అక్కడే ఉన్నాడని తెలుస్తోంది. పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ జైషే మమమ్మద్ సూచన మేరకు నాగ్పూర్లోని సంఘ్ కార్యాలయంలో రెక్కీ నిర్వహించేందుకు ప్రయత్నించి ఉంటాడని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
ఇక, ఉగ్రవాదుల రెక్కీ నేపథ్యంలో.. పోలీసులు ఆరెస్సెస్ కార్యాలయం, Hedgewar Bhavanతో పాటు పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.