మహారాష్ట్ర: పాఠశాలలు, బాణాసంచాపై ఉద్ధవ్ కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Nov 8, 2020, 5:38 PM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో కొద్దినెలల నుంచి మూతబడిన పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేందుకు రెడీ అవుతున్నాయి. దేశంలోని ఒక్కో రాష్ట్రం ఇందుకు ఏర్పాట్లు చేసుకుంటూ వస్తోంది.

దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో కొద్దినెలల నుంచి మూతబడిన పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేందుకు రెడీ అవుతున్నాయి. దేశంలోని ఒక్కో రాష్ట్రం ఇందుకు ఏర్పాట్లు చేసుకుంటూ వస్తోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో స్కూళ్లు, విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ కోవలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. మార్చి నుంచి మూసివేయబడిన దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు.

వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడానికి కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ దీపావళి తర్వాత స్కూళ్లు (9 నుండి 12 తరగతులకు) తిరిగి ప్రారంభమవుతాయని సీఎం అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

నవంబర్ 17 నుంచి 22 మధ్య రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని ఉద్ధవ్ చెప్పారు. పాఠశాలలను ఈనెల 23న తెరుస్తామని, విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఒక్కో బెంచికి ఒక్క విద్యార్థిని మాత్రమే కూర్చోనిస్తామని , తరగతులను రోజు విడిచి రోజు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి ప్రారంభంపై థాక్రే స్పందిస్తూ.. త్వరలోనే కోవిడ్‌ నిబంధనలను రూపొందించి దేవాలయాలను తిరిగి ప్రారంభిస్తామని అన్నారు.

దేవాలయాలు ప్రారంభించడం వల్ల వృద్ధులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారని... పండుగల సీజన్‌లో దేవాలయాలకు వచ్చే భక్తుల రద్దీని కూడా నివారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు.

దీపావళి పటాకులపై నిషేధం లేదని, కానీ బహిరంగ ప్రదేశాల్లో వాటిని పేల్చకూడదని మహారాష్ట్ర సీఎం అన్నారు. తాను క్రాకర్లపై నిషేధం లేదా అత్యవసర పరిస్థితిని విధించడం లేదని పేర్కొన్నారు. ప్రజలు స్వీయ క్రమశిక్షణ చూపించాలని, పటాకులు లేని దీపావళిని జరుపుకోవాలని ఆయన కోరారు.

click me!