రేషన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం: 3 కోట్ల కార్డులు తొలగింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Siva Kodati |  
Published : Mar 17, 2021, 04:36 PM IST
రేషన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం: 3 కోట్ల కార్డులు తొలగింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

సారాంశం

ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయలేదని దాదాపు 3 కోట్ల రేషన్‌ కార్డులను రద్దు చేయడం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది.   

ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయలేదని దాదాపు 3 కోట్ల రేషన్‌ కార్డులను రద్దు చేయడం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది.   

ఝార్ఖండ్‌కు చెందిన కొయిలీ దేవీ అనే మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బుధవారం న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధార్‌ అనుసంధానం లేని కారణంగా కేంద్రం మూడు కోట్ల రేషన్‌ కార్డులను రద్దు చేసిందని, దీని వల్ల ఆకలి చావులు నెలకొన్నాయని పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.

అయితే ఈ వాదనను అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అమన్‌ లేఖీ తోసిపుచ్చారు. రేషన్‌ కార్డులు రద్దు చేశామన్న ప్రకటన తప్పని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై మరింత విస్తృతంగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.  

అనంతరం దీనిపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీచేసిన సర్వోన్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.   ఝార్ఖండ్‌కు చెందిన కొయిలీ దేవీ 11 ఏళ్ల కుమార్తె సంతోషి 2018లో ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయింది.

తమ రేషన్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం లేకపోవడంతో 2017 మార్చి నుంచి స్థానిక అధికారులు తమకు రేషన్‌ నిలిపివేశారని సంతోషి కుటుంబసభ్యులు  ఆరోపించారు. పేద కుటుంబమైన తమకు రేషన్‌ రాకపోవడంతో తినడానికి ఆహారం లేక... ఆకలితో తమ కుమార్తె చనిపోయిందని కొయిలీ కన్నీటీపర్యంతమైంది.

దీనిపై 2018లోనే ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఆధార్‌ కారణంగా ఎవరికీ రేషన్‌ నిలిపివేయాలేదని ప్రభుత్వం నాటి విచారణ సందర్భంగా సమాధానమిచ్చింది.   

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మ హారతి | Ujjain Jyotirlingam | Asianet News Telugu
ఉత్తరాఖండ్‌లో గ్యాస్ కొరత.. హోటల్స్ లో ఏం చేశారో చూడండి | LPG Shortage | Asianet News Telugu