
లైంగిక వేధింపుల కేసుల్లో రోజురోజుకూ కోర్టులు ఇస్తున్న తీర్పులు వివాదాస్పదంగా మారుతున్నాయి. న్యాయవ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. బాలల మీద లైంగిక దాడుల కేసుల విషయంలో ఇటీవల ఓ జడ్జి ఇచ్చిన రెండు తీర్పులు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి గురయ్యాయి. తాజాగా అలాంటి ఓ తీర్పు మద్యప్రదేశ్ హై కోర్టు ఇచ్చింది.
లైంగిక దాడి కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిందితుడు బాధితురాలి తో రాఖీ కట్టించుకోవాలి అంటూ నిబంధన విధించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయ వ్యవస్థ ఇచ్చే ఇలాంటి ఆదేశాలతో వేధించిన వ్యక్తిని సోదరుడిగా మార్చినట్లు అయిందని వ్యాఖ్యానించింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన ఆదేశాలను తప్పుపట్టిన న్యాయస్థానం లైంగిక దాడి కేసు విచారణ సమయంలో పాటించాల్సిన పలు మార్గదర్శకాలు జారీ చేసింది. లైంగికదాడి బాధితుల గత ప్రవర్తన, వారి వస్త్రధారణ, వారి పరస్పర విరుద్ధ వైఖరుల వంటి వాటిని తీర్పులిచ్చే సమయంలో ప్రస్తావించ రాదని స్పష్టం చేసింది.
‘బెయిల్ దరఖాస్తుదారు తన భార్యా సమేతంగా 2020 ఆగస్టు 3వ తేదీ ఉదయం 11గంటలకు బాధితురాలి ఇంటికి తీసుకుని వెళ్లాలి ఆమెతో రాఖీ కట్టించుకుని అన్నివేళలా రక్షణగా నిలుస్తానని వాగ్దానం చేయాలి’ అని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు అక్రమమంటూ తొమ్మిది మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ ఎస్ రవీంద్ర బట్టల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టింది.
ఇటువంటి తీర్పులు కేసు తీవ్రతను ముఖ్యంగా లైంగిక లైంగిక వేధింపుల విషయంలో తక్కువ చేస్తాయని పేర్కొంది. చట్టం ప్రకారం బాధితురాలిపై జరిగిన నేరం.. క్షమాపణలు, సామాజిక సేవ, రాఖీ కట్టించుకోవడం, బహుమతులు ఇవ్వడం, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం ద్వారా సమసిపోయే చిన్న తప్పు కాదని తెలిపింది. ఇటువంటి విషయాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ లకు అవగాహన కల్పించాలని బార్ కౌన్సిల్ కు సూచించింది.