కరోనా దెబ్బ:సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు

By narsimha lodeFirst Published Jun 25, 2020, 3:34 PM IST
Highlights

పెండింగ్ లో ఉన్న పదో తరగతి సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సీల్డ్ కవర్లో సుప్రీంకు ఈ నెల 24వ తేదీన ఈ రిపోర్టును కేంద్రం అందించిన విషయం తెలిసిందే

న్యూఢిల్లీ: పెండింగ్ లో ఉన్న పదో తరగతి సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సీల్డ్ కవర్లో సుప్రీంకు ఈ నెల 24వ తేదీన ఈ రిపోర్టును కేంద్రం అందించిన విషయం తెలిసిందే.జూలై 1 నుండి 15 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 

పెండింగ్ లో ఉన్న టెన్త్ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసింది. సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ ఏడాది జూలై  15న ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ప్రకటించనున్నారు.

12వ తరగతి విద్యార్థులకు రెండు ఆఫ్షన్లను ఇచ్చింది సుప్రీంకోర్టు. పరీక్షకు హాజరవ్వాలా.. లేక ఇంటర్నల్ మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకొనే నిర్ణయాధికారాన్ని విద్యార్థులకు ఇచ్చినట్టుగా సీబీఎస్ఈ కోర్టుకు తెలిపింది. 

పరీక్షల నిర్వహణపై పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.కరోనా నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని సీబీఎస్ఈకి చెప్పాయి. దీంతో సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు తన నివేదికను ఇచ్చింది. 

సీబీఎస్ఈతో పాటు ఐసీఎస్ఈ పరీక్షలను కూడ రద్దు చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు.

ఈ ఏడాది మార్చి మూడో వారంలో కాలేజీలు, స్కూళ్లను కరోనా కారణంగా మూసివేసే సమయం నాటికి సీబీఎస్ఈ 10, 12 తరగతులకు చెందిన కొన్ని పరీక్షలు మిగిలిపోయాయి. మార్చి 19 నుండి 31వరకు షెడ్యూల్ చేయబడిన పరీక్షలు జరగలేదు.  దీంతో ఈ పరీక్షలను ఏప్రిల్ మాసంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

వరుస లాక్ డౌన్ లు కొనసాగడంతో పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది జూలై 1 నుండి జూలై 15 మధ్యలో ఈ పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ సమయంలో కూడ పరీక్షలు నిర్వహించలేమని ఆయా రాష్ట్రాలు చేతులెత్తేయడంతో రద్దు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.


 

click me!