
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో ( Ukraine) సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (pm narendra modi) ఈ రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) తో మాట్లాడనున్నారు. నేటి ఉదయం క్రెయిన్పై రష్యా సైనిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ విషయంలో సహాయం అందించాలని భారత్ ను ఉక్రెయిన్ కోరింది.
నాటోలో ఉక్రెయిన్ చేరడం పల్ల కొన్ని నెలలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతాయనే ఉద్రిక్తత నెలకొంది. అయితే నేటి ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా రష్యా ఉక్రెయిన్ పై యుద్దం చేయడం ప్రారంభించింది. ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల కీలుబొమ్మ అని, అది సరైన దేశం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే పేర్కొన్నారు.
నేటి సాయంత్రం నాటికి రష్యా సైన్యం ఉక్రెయిన్లోని 70 కంటే ఎక్కువ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసిందని రష్యా ప్రకటించింది. ఇందులో 11 ఎయిర్ఫీల్డ్లు, 18 రాడార్ స్టేషన్లు S-300, Buk-M1 క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఉక్రెయిన్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కనీసం 68 మంది సైనికులు, పౌరులు మరణించి ఉంటారని అంచనా.
గురువవారం ఉదయం ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా భారతదేశ జోక్యాన్ని కోరారు. ప్రపంచంలో భారతదేశం చాలా ప్రభావంతమైనది. మేము ఈ సంక్షోభ సమయంలో భారత్ మద్దతు కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత శక్తిమంతమైన, గౌరవనీయమైన ప్రపంచ నాయకులలో ఒకరని తెలిపారు. మోదీ బలమైన స్వరంతో పిలిస్తే, పుతిన్ ఆలోచిస్తారని తనకు నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశం ఇప్పటికే దౌత్యపరమైన అంశం పట్ల పిలుపునిచ్చింది. ఇలా చేయకపోతే పెద్ద సంక్షోభంలోకి పడిపోతామని చెప్పింది. ‘‘ ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఉక్రెయిన్ శాంతి, భద్రతను దెబ్బతీసే పరిణామాలు ఎదురవుతాయని, దీని పట్ల తాము ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తన్నామని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి TS తిరుమూర్తి అన్నారు.
ఉక్రెయిన్,రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల మడి చమురు ధరల హెచ్చు తగ్గులపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక నివాసంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్యతో మార్కెట్లు కుదేలయ్యాయి. గ్లోబల్ మెల్ట్డౌన్కు అనుగుణంగా 30 షేర్ల బెంచ్మార్క్ సెన్సెక్స్ 2,700 పాయింట్లకు పైగా క్రాష్ అయ్యింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఉదయం, ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేయడంతో తరలింపు కోసం కైవ్కు వెళ్లాల్సిన ప్రత్యేక విమనాలు రద్దు అయ్యాయి. నేడు ఉక్రెయిన్ కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి తిరిగిరావడంతో భారతదేశం ఇప్పుడు మన పౌరులను తరలించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరుల తరలింపులో సహాయం చేయడానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖ హంగేరీ, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రొమేనియాలోని ఉక్రెయిన్తో భూ సరిహద్దులకు బృందాలను పంపుతోంది