
అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ను ప్రభుత్వం కాపాడుతోందంటూ బీజేపీ ఎంపీలు ఆరోపించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బిర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఈ రోజు పార్లమెంటులో అట్టుడికింది.
లోక్సభ, రాజ్యసభ రెండింటిలోని అధికార పక్ష సభ్యులు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయాలని, ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు జరపాలని కోరారు. ఎన్సిపి సీనియర్ నాయకుడిని రక్షిస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అయితే ఈ అవినీతి ఆరోపణలను అత్యంత అవినీతి పరులు మాత్రమే చేస్తున్నారని శివసేన తిప్పికొట్టింది. రాష్ట్ర పాలక కూటమి నాయకులు భవిష్యత్ కార్యక్రమాల నిర్ణయాల కోసం సమావేశమైన రోజే ఈ వివాదం తెరమీదికి వచ్చింది.
మాజీ ముంబై మాజీ పోలీసు కమిషనర్ సింగ్ ముఖ్యమంత్రి ఠాక్రేకు రాసిన లేఖలో పార్లమెంటులో రచ్చ జరగబోతుందని పేర్కొన్నారు. ఈ లేఖలో దేశ్ ముఖ్ ప్రతి నెలా రూ. 100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడుతున్నారని, కేసుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంబానీ ఇంటికి బాంబు బెదిరింపుల కేసు విషయంలో విధుల నుంచి తొలగించబడిన కొద్ది రోజులకు సింగ్ ఈ లేఖ రాశారు.
అయితే సింగ్ చేసిన ఈ ఆరోపణలను దేశ్ ముఖ్ ఖండించారు. అంతేకాదు ఈ నిరాధార ఆరోపణలకు గానూ అతని మీద పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రతిపక్షం రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఒకవేళ అది జరగకపోతే ఠాక్రే అతన్ని బహిష్కరించాలని కోరింది.
ఈ రోజు పార్లమెంటులో పలువురు బిజెపి సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. రాజ్యసభలో కూడా బిజెపి ఎంపీలు మహారాష్ట్ర ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు. "మహారాష్ట్ర సర్కార్ బర్ఖాస్ట్ కరో" అనే నినాదాన్ని లేవనెత్తారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జావేద్కర్ తదితరులు ఈ విషయాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించినప్పటికీ చైర్ వారికి అవకాశం ఇవ్వలేదు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
లోక్సభలో బిజెపి జబల్పూర్ ఎంపి రాకేశ్ సింగ్ మాట్లాడుతూ, "ఇప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్రకు సరిపోయేది కాదు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా హోంమంత్రిని రక్షించడానికి కారణం ఏమిటి? దీన్ని కేంద్ర ఏజెన్సీలు నిష్పాక్షికంగా విచారించాల్సిన అవసరం ఉంది. దీనికి బాధ్యతగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు.
నార్తీస్ట్ ముంబై ఎంపి మనోజ్ కొటక్ కూడా రూ. 100 కోట్ల దోపిడీ ఆరోపణలను లేవనెత్తారు. " ఒక్క ముంబైలోనే ఈ రూ. 100 కోట్లు. మిగతా మహారాష్ట్రలోని ఇతర నగరాల్లో ఎంత డబ్బు సేకరించారు? దీనిమీద దర్యాప్తు జరపాలి, అలాగే హోంమంత్రి కూడా రాజీనామా చేయాలని నేను కోరుతున్నాను" అని ఆయన అన్నారు.
మరో ఎంపీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ దేశ్ ముఖ్ ను రక్షించారని ఆరోపించారు. లేకపోతే ఈ అవినీతిలో ప్రమేయం ఉన్న ఇతర పేర్లను ఆయన వెల్లడిస్తాడని భయపడి ఉండొచ్చు అన్నారు.
కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ "మహారాష్ట్రలో వసూళ్ళ గురించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "మహారాష్ట్రలో జరుగుతున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇది రూ.100 కోట్లకు సంబంధించింది. అయితే అది ఈ సభకు సంబంధించినది కాదు" అని ఆయన అన్నారు.
శివసేన ఈ ఆరోపణలను తిప్పికొడుతూ... గుజరాత్లోని కెవాడియాలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహం కోసం ప్రభుత్వ రంగ యూనిట్ల సిఎస్ఆర్ నిధులను మళ్లించారని చెప్పింది. వాటిని ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధికి మళ్లించారని ఆరోపించింది.
రత్నగిరి-సింధుదుర్గ్ ఎంపి వినాయక్ రౌత్ మాట్లాడుతూ , "ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం. పరమ్ బిర్ సింగ్ లేఖపై 'అత్యంత అవినీతిపరులు’ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. '" అని అన్నారు.
బిజెపి ఎంపీలపై స్పందించడానికి తమకు అవకాశం ఇవ్వలేదని శివసేన ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్, ఎన్సిపి ఎంపీలు సభలో ఉండిపోయారు.
తరువాత మాట్లాడిన ఎన్సిపి సుప్రియ సులే ఎనిమిది మంది బిజెపి ఎంపిలకు జీరో అవర్ లో మాట్లాడటానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దీన్ని వారు నాట్ లిస్టెడ్ లో పెట్టినా, సభకు ఇది "బ్లాక్ డే" అన్నారు.