ఉత్తరాఖండ్: మళ్లీ ఉప్పొంగిన రిషిగంగా... నిలిచిపోయిన సహాయక చర్యలు

By Siva KodatiFirst Published Feb 11, 2021, 4:44 PM IST
Highlights

యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టిన ఉత్తరాఖండ్‌ మెరుపు వరదల ఘటనను మరిచిపోకముందే చమోలీ జిల్లాలో రిషి గంగా నది మళ్లీ ఉప్పొంగింది. దీంతో తపోవన్ విద్యుత్ కేంద్రం సొరంగంలో సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు.

యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టిన ఉత్తరాఖండ్‌ మెరుపు వరదల ఘటనను మరిచిపోకముందే చమోలీ జిల్లాలో రిషి గంగా నది మళ్లీ ఉప్పొంగింది. దీంతో తపోవన్ విద్యుత్ కేంద్రం సొరంగంలో సహాయక చర్యలను అధికారులు నిలిపివేశారు.

సొరంగంలో చిక్కుకున్న వారి కోసం ఆదివారం నుంచి గాలిస్తున్నారు. రిషిగంగ నీటి మట్టం పెరుగుతుండటంతో సొరంగం లోపల విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందితో పాటు డ్రిల్లింగ్‌ చేసేందుకు ఉంచిన భారీ యంత్రాలను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

Also Read:సొరంగంలో చిక్కుకొన్న 12 మంది కార్మికులు: ఫోన్ కాల్ కాపాడింది

తపోవన్‌ విద్యుత్తు కేంద్రం సొరంగంలో చిక్కుకున్న 25 నుంచి 35మంది కోసం అధికారులు తీవ్రంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. లోపల ఉన్నవారిని ఎలాగైనా రక్షించాలన్న లక్ష్యంతో పూడుకుపోయిన మట్టికే రంధ్రాలు చేసి ప్రాణవాయువు పంపించాలని యత్నిస్తున్నారు.

వీరి ప్రయత్నాలకు రిషిగంగ అంతరాయం కలిగిస్తోంది. మరోవైపు, నీటిమట్టం పెరగడంతో  చమోలి ఎస్పీ యశ్వంత్‌ సింగ్‌ చౌహాన్‌ నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.

ఆదివారం రోజున ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైనవారిలో ఇప్పటి వరకు 34 మంది మృతదేహాలు దొరికాయి. వీరిలో 29 మందిని గుర్తించారు. అయితే ఇంకా జాడ తెలియని వారి సంఖ్య 172గా ఉంది. 

click me!