
పంజాబ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. పంజాబ్ లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఘోర పరాజయం ఎదురైంది. అయితే... కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 15 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్లు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నవ జోత్ సింగ్ సిద్ధూ మధ్య మొదలైన విభేదాలే పార్టీ ఓటమికి కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. కెప్టెన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనపై సిద్ధూ అనేక విమర్శలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు కనీసం పట్టించుకోలేదు. ఆ సమస్యను పరిష్కరించే దిశగా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చివరికి కెప్టెన్ సింగ్కు ఇష్టం లేకపోయినా పీసీసీ అధ్యక్ష పదవిని సిద్ధూకి కట్టబెట్టారని, ఆ పదవిని పొందిన తర్వాత కూడా సిద్ధూ సంయమనం పాటించకుండా కెప్టెన్పై విమర్శలు గుప్పించడంతో ఆయన పార్టీకి దూరమయ్యారని చెప్తున్నారు.
మరోవైపు పంజాబ్ డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాను సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకించి, వివాదం సృష్టించారు. ఆయనను మార్చి సిద్ధార్థ ఛటోపాధ్యాయను డీజీపీగా నియమించే వరకు పట్టువీడలేదు. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, హోం మంత్రి సుఖ్జిందర్ రణధవా సంపూర్ణంగా సహోటాకు మద్దతుగా నిలిచినప్పటికీ సిద్ధూ తన పంతం వీడలేదు.
సహోటాను డీజీపీగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి కూడా సిద్ధూ రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజీనామాను ఉపసంహరించుకున్నప్పటికీ, డీజీపీ నియామకానికి అధికారులతో కూడిన కొత్త ప్యానెల్ను యూపీఎస్సీ ప్రకటించినపుడు, కొత్త అడ్వకేట్ జనరల్ను నియమించినపుడు మాత్రమే తాను మళ్ళీ పీసీసీ చీఫ్ పదవిని స్వీకరిస్తానని షరతు విధించారు.
కాంగ్రెస్ ఓట్లను చీల్చడంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంత మేరకు కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత దళిత నేత చరణ్జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆయనతో కూడా సిద్ధూ మొదట్లో విభేదించారు.
ఈ ఎన్నికల ప్రచారానికి కేవలం చరణ్జిత్ సింగ్ చన్నీ మాత్రమే నాయకత్వం వహించారు. సీనియర్ నేతలు సునీల్ జక్కర్, నవజోత్ సింగ్ సిద్ధూ వంటివారు ప్రచారానికి మనస్ఫూర్తిగా సహకరించలేదని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సిద్ధూ, చన్నీలలో ఎవరో ఒకరిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవాలని కోరుతూ ఆ పార్టీ నిర్వహించిన పోల్లో ఎక్కువ మంది చన్నీకి ఓటు వేశారు. దీంతో చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో సిద్ధూ కేవలం తాను పోటీ చేస్తున్న అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గానికే పరిమితమై ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా.. కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి.