
Rajyasabha Elections 2022: రాజ్యసభ ఎన్నికలకు (Rajyasabha Elections 2022) సర్వం సిద్ధమైంది. నేడు రాజ్యసభలోని 16 స్థానాలకు ఓటింగ్ జరుగనున్నది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. ఇప్పటికే 11 రాష్ట్రాల్లోని 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో శుక్రవారం(నేడు) మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానాలోని మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే.. జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానాలలో 16 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కఠినమైన పోటీలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో రిసార్ట్ రాజకీయాలకు తెర లేసింది. రాజస్థాన్ లో 4 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానాల్లో గట్టి పోటీ ఉండటంతో బీజేపీ తన ఎమ్మెల్యేలను జైపూర్ లోని దేవీ రతన్ రిసార్ట్ కు తరలించింది. బీజేపీకి సంఖ్య బలం లేకున్న రాజస్థాన్ లో అభ్యర్థిని నిలబెట్టడంతో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటు కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.
మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి.. ఇక్కడ రాజకీయం వేడెక్కుతుంది. ఇప్పటికే అధికార పార్టీ శివసేన తమ ఎమ్మెల్యేలను బస్సుల్లో ముంబయిలోని ఓ హోటల్ కు తరలించింది. అక్కడ ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికలపై సూచనలు చేశారు. మహారాష్ట్రలో గత 22 ఏళ్లుగా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడేవారు. కానీ, ఈసారి ఓటింగ్ జరగడంతో ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి.
కర్ణాటకలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఈ రాష్ట్రంలోని నాలుగు స్థానాల ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఇక్కడ నుంచి ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. జేడీఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మాజీ ప్రధాని దేవెగౌడ రంగంలోకి దిగాడు. ఇక్కడ బలం లేకున్న బీజేపీ మూడో అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం. దీంతో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
ఇక హర్యానాలో 2 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. హర్యానాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి రాజకీయాలు కూడా హీటెక్కాయి. దీంతో పోటీ వాతావరణం నెలకొంది. నాలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులెవరూ పోటీ నుంచి తప్పుకోకపోవటంతో ఆయా రాష్ట్రాల్లో తీవ్ర పోటీ నెలకొంది.
ఈ ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు బరిలో దిగారు.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్కు చెందిన రణదీప్ సూర్జేవాలా, జైరామ్ రమేష్, ముకుల్ వాస్నిక్, శివసేనకు చెందిన సంజయ్ రౌత్లు బరిలో నిలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లోతన బలం తగ్గనుంది. అలాగే, ఇటీవలే రాజ్యసభలో 100 మార్కు చేరుకున్న భాజపా బలం సైతం నూరులోపే పరిమితం కానుంది. 1990 తర్వాత రాజ్యసభ లో 100 మార్కును దాటిన పార్టీగా బీజేపీ నిలిచింది. అలాగే.. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ్య స్థానాలు కీలకం కానున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.