Odisha Train Accident: 200 దాటిన  మృతుల సంఖ్య.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి .. 

By Rajesh KarampooriFirst Published Jun 3, 2023, 4:40 AM IST
Highlights

Coromandel Express: ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రమాదం దురదృష్టకరమని, సంఘటన గురించి తన మంత్రిత్వ శాఖకు తెలిసిన కొద్దిసేపటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పారు.

Coromandel Express: ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బహనాగ్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 207 మంది ప్రయాణికులు మరణించగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. ఈ దశాబ్ద కాలంలో సంభవించిన ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.   

ఈ ఘోర ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు . ఈ ఘటనపై రైల్వే మంత్రి ANIతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం దురదృష్టకరమని, సంఘటన గురించి తన మంత్రిత్వ శాఖకు చేరిన కొద్దిసేపటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పారు. రైలు ఎలా పట్టాలు తప్పిందో తెలుసుకోవడానికి తాను ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాననీ,  ఈ విషాద ప్రమాదానికి మూలకారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమని  రైల్వే మంత్రి అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ, ఇందులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఒడిఆర్‌ఎఫ్), స్థానిక అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. 

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామనీ, మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹ 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹ 2 లక్షలు, స్వల్ప గాయాలైన ప్రయాణికులకు ₹ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వైష్ణవ్ తెలిపారు. క్షతగాత్రులను వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రులకు తరలించడంపై అధికారులు దృష్టి సారించారని, రైలు పట్టాలు తప్పిన ఘటనలో మృతులు, గాయాల సంఖ్యను ఇంకా నిర్ధారించాల్సి ఉందని మంత్రి తెలిపారు. రైలు పట్టాలు తప్పిన మృతుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బస్సులు, రైలు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికారిక ద్రువీకరణ తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.

హెల్ప్‌లైన్ నంబర్లు 

హౌరా: 033-26382217

ఖరగ్‌పూర్: 8972073925, 9332392339

బాలాసోర్: 8249591559,  7978418322

షాలిమార్: 9903370746

సంత్రాగచ్చి: 8109289460, 8340649469

భద్రక్: 7894099579, 9337116373

జాజ్‌పూర్ కియోంజర్ రోడ్: 9676974398

కటక్: 8455889917

భువనేశ్వర్: 06742534027

ఖుర్దా రోడ్: 6370108046 , 06742492245

 

click me!