"మేము దేశానికి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇవ్వలేదు": బిజెపిపై రాహుల్ గాంధీ ఫైర్

Published : Jan 06, 2023, 05:43 AM IST
"మేము దేశానికి ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇవ్వలేదు": బిజెపిపై రాహుల్ గాంధీ ఫైర్

సారాంశం

దేశంలో నెలకొన్న  ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం బీజేపీపై విరుచుకుపడ్డారు. 

దేశంలో నెలకొన్న  ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీపై  కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. "70 ఏళ్లలో మేము ఏమి చేసాము అని బిజెపి మమ్మల్ని అడుగుతుంది, బిజెపి ఇచ్చినంతగా మేము దేశానికి ద్రవ్యోల్బణం,నిరుద్యోగం ఇవ్వలేదు." అని విమర్శించారు. " నేడు భారత్ ఈ  45 ఏండ్లలో అత్యధిక నిరుద్యోగంతో సతమతమవుతోంది. 100 మంది యువతలో 42 మందికి ఆదాయం లేదా జీవనోపాధి లేదు. దేశంలోని పౌరులు ఈ స్థాయి ద్రవ్యోల్బణాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. రేషన్ నుండి ఇంధనం వరకు ప్రతిదీ ఖరీదైనది. సామాన్యుల బతుకు కష్టంగా మారింది. " అన్నారాయన. 

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు సహాయం చేస్తుంది తప్పా.. దేశ ప్రజల కోసం కాదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం తన పనిని సరిగా నిర్వహించలేకపోతోందనీ, సామాన్యుల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. నిజంగా మోడీ ప్రభుత్వం తమ పెట్టుబడిదారీ స్నేహితుల కోసం ఏదైనా చేయగలదనీ, కానీ దేశం, ఈ దేశ ప్రజల పట్ల శ్రద్ధ వహించడం లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ పద్దతిని మార్చాలని, దేశాన్ని ఏకం చేయాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, ఈ క్రమంలోనే 'భారత్ జోడో యాత్ర'కు ప్రారంభమైందని అన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం ప్రశ్నలను అణిచివేసేందుకు ఒక క్రమపద్ధతిలో ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సమస్యలపై ప్రజలు బహిరంగంగా మాట్లాడటం చాలా కష్టమని ఆయన అన్నారు. కులం, మతం, భాష, ఆహారపు అలవాట్లు, వేషధారణల ప్రాతిపదికన భారతీయులను ఇరకాటంలో పెట్టడం ద్వారా ప్రశ్నలను నిశ్శబ్దం చేసి దృష్టిని మళ్లించే క్రమబద్ధమైన ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 

దేశంలో నెలకొన్న అతిపెద్ద సమస్యలలో నిరుద్యోగం ఒక్కటి. యువత ఉద్యోగాలు , భద్రత కోసం నిరాశగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి తగ్గిందని రాహుల్ గాంధీ అన్నారు. అగ్నివీర్ యోజనను ఉదాహరణగా చూపుతూ ఉద్యోగ భద్రత తగ్గిపోతోందన్నారు.

వాగ్దానాలను తుంగలో తొక్కారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ప్రధానంగా యుపిలోని చిన్న రైతులు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ఎంఎస్‌పి లేకపోవడం, బియ్యం సేకరణ తగ్గిపోవడం, చెరకు చెల్లింపు ఆలస్యం వంటి సమస్యలతో పోరాడుతున్నారనీ విమర్శించారు. వ్యవసాయ చట్టం ఉద్యమం సందర్భంగా తమ గొంతును అణచివేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీ భారత్ జోడో యాత్ర  ఉత్తరప్రదేశ్ నుండి హర్యానాలో తిరిగి ప్రవేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి సోనియా గాంధీని కలవడానికి రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లారని, రేపు ఉదయం తిరిగి వస్తారని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా అన్నారు. భూపీందర్ సింగ్ హూడా మాట్లాడుతూ, 'యాత్ర సాయంత్రం పానిపట్‌లోని సనోలి సరిహద్దు నుండి హర్యానాలోకి ప్రవేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు రాహుల్ ఢిల్లీ వెళ్లారు. అతను శుక్రవారం ఉదయం పానిపట్‌కు తిరిగి వస్తాడు. యాత్ర హర్యానా లెగ్‌లో తిరిగి ప్రారంభమవుతుంది. పానిపట్‌లో బహిరంగ సభతో సహా శుక్రవారం షెడ్యూల్ ప్రకారం యాత్ర  కార్యక్రమాలు జరుగుతాయని భూపిందర్ సింగ్ హుడా తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu