
పార్లమెంట్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటివరకు మోదీని విమర్శించి.. ఆ వెంటనే వెళ్లి ఆయనను హగ్ చేసుకున్నారు.దీనిపై శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ స్పందించారు.
ఇది పార్లమెంట్ అనీ, ‘మున్నాభాయ్ ఆలింగనం’ చేసుకునే ప్రదేశం ఇక్కడ కాదు అని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటులో ఇలా ప్రవర్తించడమేంటని అన్నారు.
అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన రాహుల్ ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుపై, మహిళలకు రక్షణ లేదంటూ ధ్వజమెత్తారు. ప్రజల నెత్తిన జీఎస్టీ రుద్దారని విమర్శించారు.
చివరలో నన్ను పప్పు అన్నా ఫర్వాలేదు, తిట్టినా నేను ద్వేషం పెంచుకోను అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి.. తన స్థానం నుంచి నేరుగా మోదీ వద్దకు వెళ్లి కుర్చీలో కూర్చున్న ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ పరిణామంతో సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. తర్వాత నవ్వులు చిందించారు. మోదీ కూడా కరచాలనం చేసి రాహుల్ భుజం తట్టి నవ్వారు.