Rahul disqualification: రాహుల్ గాంధీ కంటే ముందు అనర్హత వేటుపడిన రాజకీయ నాయకులు వీళ్లే..

Rahul disqualification: పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం కోల్పోయారు. ఈ చట్టం కింద రాహుల్ కంటే ముందే చాలా మంది ప్రజాప్రతినిధులు సభ్యత్వం కోల్పోయారు. ఈ జాబితాలో ఉన్న  రాజకీయ నాయకులు వీళ్లే.. 

Google News Follow Us

Rahul disqualification: పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం కోల్పోయారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏదైనా కేసులో  ప్రజాప్రతినిధికి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్ష పడితే.. నేరం రుజువైన తేదీ నుంచి సభా సభ్యత్వానికి అనర్హుడవుతాడు. శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం కూడా విధించనున్నారు. ఈ చట్టం ప్రకారం..  రాహుల్ కంటే ముందే చాలా మంది ప్రజాప్రతినిధులు సభ్యత్వం కోల్పోయారు. నేరారోపణ కారణంగా సభ్యత్వం కోల్పోయిన రాజకీయ నాయకులు వీళ్లే..  వారి కేసులపై ఓ లుక్కేద్దాం.. 

లాలూ ప్రసాద్ యాదవ్: సెప్టెంబరు 2013లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ఆయన బీహార్‌లోని సరన్‌ ఎంపీగా ఉన్నారు.

జె.జయలలిత: అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నందుకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత 2014 సెప్టెంబర్‌లో తమిళనాడు శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

PP మొహమ్మద్ ఫైజల్: లక్షద్వీప్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎంపి పిపి మహ్మద్ ఫైజల్ 2023 జనవరిలో హత్యాయత్నం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన తన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయాడు. అయితే, కేరళ హైకోర్టు ఆ తర్వాత ఫైజల్‌కు విధించిన శిక్ష , శిక్షను సస్పెండ్ చేసింది. తన అర్హతకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయలేదు. 

ఆజం ఖాన్: 2019లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఆజం ఖాన్‌కు ద్వేషపూరిత ప్రసంగం కేసులో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన అక్టోబర్ 2022 లో తన ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన రాంపూర్ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

అనిల్ కుమార్ సాహ్ని: RJD ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్నికి చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో 2022 అక్టోబర్‌లో ఆయన  బీహార్ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

విక్రమ్ సింగ్ సైనీ: బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ.. అక్టోబర్ 2022లో ఉత్తరప్రదేశ్ శాసనసభ నుండి అనర్హత వేటు పడింది. 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో అతనికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఆ సమయంలో ఆయన ఖతౌలీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ప్రదీప్ చౌదరి: కాంగ్రెస్ ఎమ్మెల్యే చౌదరి దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన జనవరి 2021లో హర్యానా శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన కలక నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కుల్దీప్ సింగ్ సెంగార్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తర్వాత 2020 ఫిబ్రవరిలో సెంగార్ ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు.

అబ్దుల్లా ఆజం ఖాన్: SP ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం ఖాన్ ఫిబ్రవరి 2023లో ఉత్తరప్రదేశ్ శాసనసభ నుండి అనర్హుడయ్యాడు. 15 ఏళ్ల నాటి కేసులో అతడికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా రాంపూర్ స్వర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

అనంత్ సింగ్: RJD ఎమ్మెల్యే అనంత్ సింగ్ జూలై 2022లో బీహార్ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆయన నివాసంలో అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పట్టుపడిన కేసులో దోషిగా గుర్తించబడ్డాడు. సింగ్ పాట్నా జిల్లాలోని మొకామా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

Read more Articles on