
మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతావైఫల్యం ఎదురైందని వచ్చిన ఆరోపణలను పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ గురువారం తప్పుపట్టారు. బీజేపీ కావాలనే రాజకీయం చేస్తోందనీ, వాస్తవాలను పక్కన పెట్టి.. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. పంజాబ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కావాలనే.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రధాని మోడీ తాను ఏ కార్యక్రమంలో పాల్గొనకుండా వెనుతిరిగారని, దానికి రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమే కారణమని తమ ప్రభుత్వాన్ని నిందించడం పొరపాటుగా ఆయన పేర్కొన్నారు. ఇది కేంద్రప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద కుట్ర అని ఆరోపించారు. ఎన్నికల్లో పంజాబ్ పంజాబీయుల పరువు తీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందనీ. రాష్ట్రాన్ని కించపరిచే ప్రయత్నమని ఆరోపించారు. పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నమని అని చన్నీ అన్నారు.
ఈ విషయంలో పంజాబ్ వాసులకు హంతకులుగా చిత్రీకరించారనీ, తాము జాతీయవాదులమనీ, తాము దేశం కోసం ఎన్నో యుద్ధాలలో పోరాడమనీ, తమలో చాలా మంది విధినిర్వహణ లో మరణించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సానూభూతి పొందడానికే బీజేపీ ఈ కుట్ర చేస్తోందని, ప్రధాని మోదీ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని బీజేపీ చేసిన ఆరోపణలపై విరుచుకుపడ్డారు.
ప్రధాని ప్రాణాలకు ముప్పు ఎక్కడుంది? ఆయనకు కిలోమీటరు దూరంలో ఎవరూ లేరు. రాయి విసిరలేదు? బుల్లెట్ పేల్చలేదు? నినాదాలు చేయలేదు? అయినా.. నేను ప్రాణాలతో బతికి బయటపడ్డానని ఎలా అంటారు. అలాంటి సున్నితమైన ప్రకటన.. ప్రధాని చేయడమేమిటీ? అని నిలదీశారు. వాస్తవానికి ప్రధాని మోడీ పాల్గొనవలసిన ఫిరోజ్పూర్ ర్యాలీ సందర్భంగా బిజెపి వారు 70,000 కుర్చీలను ఏర్పాటు చేయగా, కేవలం 700 మంది మాత్రమే హాజరయ్యారని, జనం స్పందన పేలవంగా ఉండడమే మోడీ వెనక్కు తిరిగిపోడానికి కారణమైందని సిఎం పేర్కొన్నారు.
ర్యాలీ కార్యక్రమానికి ముందుగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆ ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుని క్షేత్రస్థాయి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుందని, అలాంటప్పుడు భద్రతా వైఫల్యానికి తావు లేదన్నారు. షెడ్యూలు ప్రకారం మోడీ హెలికాఫ్టర్ ద్వారా ప్రయాణించాల్సి ఉండగా, ఒక్కసారిగా రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని అనుకున్నారని సిఎం వివరించారు. పంజాబ్ వ్యతిరేక శక్తులు ప్రతీకార రాజకీయాలను విడిచిపెట్టి ప్రజలు ముఖ్యంగా రైతులు ఎందుకు వారిని ఇష్టపడడం లేదో ఆలోచించాలని హితవు పలికారు. ఈ ఘటనపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు రెండూ వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాయి. అలాగే సుప్రీం కోర్టు కూడా పిటిషన్లను స్వీకరించింది.