నాటు బాంబులు, కత్తులతో దాడి.. పుదుచ్చేరిలో బీజేపీ కార్యకర్త హత్య

By Mahesh RajamoniFirst Published Mar 27, 2023, 5:23 PM IST
Highlights

Puducherry: పుదుచ్చేరి హోంమంత్రి ఏ. నమశ్శివాయం బంధువు, కనువపేటకు చెందిన బీజేపీ కార్యకర్త సెంథిల్ కుమార్ (45) ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలోని బేకరీ సమీపంలో నిల్చున్నాడు. ఈ క్రమంలో బైకుల మీద వచ్చిన పలువురు దుండగులు ఆయనపై బాంబులు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు.  
 

Puducherry BJP worker Senthil Kumar: ఆదివారం రాత్రి మోటారు సైకిల్ పై వచ్చిన ఏడుగురు వ్యక్తులు పుదుచ్చేరి బీజేపీ కార్యకర్తపై రెండు నాటు బాంబులు విసిరారు. అనంతరం కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వివరాల్లోకెళ్తే.. పుదుచ్చేరి హోంమంత్రి ఏ. నమశ్శివాయం బంధువు, కనువపేటకు చెందిన బీజేపీ కార్యకర్త సెంథిల్ కుమార్ (45) ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలోని బేకరీ సమీపంలో నిల్చున్నాడు. ఈ క్రమంలో బైకుల మీద వచ్చిన పలువురు దుండగులు ఆయనపై బాంబులు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు.  

ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. మోటారు సైకిల్ పై వచ్చిన ప‌లువురు మొద‌ట ఆయ‌న‌ను చుట్టుముట్టారు. ఈ ముఠా మొదట సెంథిల్ కుమార్ పై రెండు నాటు బాంబులు విసిరింది. అతను కుప్పకూలిపోగానే క‌త్తుల‌తో దాడి చేసి ప్రాణాలు తీశారు. అనంత‌రం అక్క‌డి నుంచి పరారయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి.

కొద్దిసేపటికే సుమారు 700 మంది బీజేపీ కార్యకర్తలు, కుమార్ బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హోంమంత్రి ఏ. నమశ్శివాయం.. సెంథిల్ కుమార్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతునిపై ఓ వ్యక్తి రెండు నాటు బాంబులు విసిరిన దృశ్యాలు ఉన్న  ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ ప్రాంతం పొగతో నిండిపోవడంతో ముఠా సభ్యులు బీజేపీ కార్యకర్తపై కర్రలతో దాడి చేయడం కనిపించింది. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

click me!