థర్డ్ వేవ్ హెచ్చరికలు: ముందుగానే అప్రమత్తమైన మోడీ.. ఆక్సిజన్, మౌలిక సదుపాయాలపై సమీక్ష

By Siva KodatiFirst Published Jul 9, 2021, 3:35 PM IST
Highlights

కరోనా మూడో దశ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సెకండ్ వేవ్ మాదిరిగా ఆక్సిజన్, వెంటిలేటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. 

కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ నిల్వలు, సరఫరాకు సంబంధించిన అంశాలపై ఆయన అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సెకండ్ వేవ్ లో చాలా ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు . ఈ నేపథ్యంలోనే ప్రధాని ముందే అప్రమత్తమయ్యారు.

ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం వాటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, త్వరలోనే 1,500 ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ప్రధానికి అధికారులు వివరించారు. ఈ ప్లాంట్ల ద్వారా 4 లక్షల పడకలకు ఆక్సిజన్ ను సరఫరా చేయొచ్చని చెప్పారు.

Also Read:వచ్చే నెలలో థర్డ్ వేవ్ ? ఎస్ బీఐ నివేదిక ఏం చెబుతోంది?..

వీలైనంత త్వరగా వాటిని ఏర్పాటు చేసి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయాల్సిందిగా అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ, వాటిని ఆపరేట్ చేసే విధానంపై ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణనివ్వాలని  ప్రధాని సూచించారు. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని, 8 వేల మందికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.

ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఇంటర్నెట్ టెక్నాలజీలను విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రజలు ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు తగ్గుతున్నాయన్న సాకుతో చాలా మంది జాగ్రత్తలను పాటించట్లేదని అన్నారు. తీవ్రత తగ్గినా.. దాని ప్రమాదం ఇంకా పొంచే ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ సూచించారు.

click me!