ఐపీఎస్‌కు రాజీనామా, రాజకీయాల్లోకి ప్రవేశం: 37 ఏళ్లకే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియామకం

By Siva KodatiFirst Published Jul 9, 2021, 3:03 PM IST
Highlights

ఇటీవల కేంద్ర కేబినెట్‌ను ప్రక్షాళన చేసిన బీజేపీ అధిష్టానం.. రాష్ట్ర కమిటీల్లోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా యువతకు పెద్ద పీట వేసేందుకు యత్నిస్తోంది. తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖను యువకుడి చేతిలో పెట్టింది. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించిన ఎల్.మురుగన్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. దీంతో, అన్నామలైను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు.  అన్నామలైను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నియామకమే ఖరారైంది.

Also Read:మోడీ నయా టీం : మహిళా శక్తికి పట్టం.. చేనేత చీరల్లో మెరిసిన 11మంది మంత్రులు..

అన్నామలై వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. 2011 కర్ణాటక కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. కర్ణాటకలోని ఉడుపి, చిక్కమంగళూరు జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. బెంగళూరు సౌత్ డీసీపీగా కూడా బాధ్యతలను నిర్వహించారు. 2019 సెప్టెంబర్ లో ఐపీఎస్ కు రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉద్యోగాన్ని వీడిన సుమారు 11 నెలల తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవకుచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అన్నామలై ఓటమిపాలయ్యారు. సుమారు 24,816 ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. పార్టీలో చేరి ఏడాది కూడా కాకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులను ఆయన చేజిక్కించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇప్పటి వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు అన్నామలై కావడం గమనార్హం.
 

click me!