భూ వివాదం.. ఘర్షణ: అడ్డొచ్చిన పూజారి సజీవ దహనం

By Siva KodatiFirst Published Oct 9, 2020, 2:56 PM IST
Highlights

భూ వివాదంలో ఏకంగా ఆలయ పూజారిని సజీవ దహనం చేశారు ఆగంతకులు. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌ కరౌలి జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న రాధాకృష్ణ ఆలయంలో పూజధికాలు నిర్వహించేందుకు బాబాలాల్ వైష్ణవ్ అనే పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు

భూ వివాదంలో ఏకంగా ఆలయ పూజారిని సజీవ దహనం చేశారు ఆగంతకులు. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌ కరౌలి జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న రాధాకృష్ణ ఆలయంలో పూజధికాలు నిర్వహించేందుకు బాబాలాల్ వైష్ణవ్ అనే పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు.

ఈ వ్యవహారం వివాదానికి దారి తీసింది. బాబాలాల్ తన భూమిని ఆనుకుని వున్న ఫ్లాట్‌లో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు పనులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి స్థలం చదును చేసే పనులు కూడా చేపట్టారు.

అయితే ఈ భూమి తమదని ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని మీనా వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీనిపై వివాదం రేగడంతో విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది. ఈ క్రమంలో వారు బాబాలాల్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ఆ భూమిలో సదరు పూజారి తన పంట దిగుబడిని వుంచాడు. ఇదే సమయంలో బాబాలాల్ చదును చేసిన స్థలంలో గుడిసె నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ వివాదంలో పంటను తగులబెట్టడంతో పాటు అడ్డొచ్చిన బాబాలాల్‌పైనా పెట్రోల్ పోసి నిప్పంటించారు.

స్థానికులు అతనిని జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాబాలాల్ గురువారం రాత్రి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు కైలాష్ మీనాను అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. 

click me!