
న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 విజయవంతగా చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో సేఫ్గా ల్యాండ్ అయినప్పటి నుంచి ల్యాండర్, అందులో నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్లు పరిశోధనలు ప్రారంభించాయి. చంద్రుడి ఉపరితలంపై కలియతిరుగుతూ ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి ఖనిజాలను, మూలకాలను గుర్తించే పనిలో పడింది. 14 రోజులపాటు పని చేసిన ఈ ప్రజ్ఞాన్ రోవర్ను స్లీప్ మోడ్లోకి పంపినట్టు ఇస్రో వెల్లడించింది.
‘ప్రస్తుతం బ్యాటరీ ఫుల్గా చార్జ్ అయింది. చంద్రుడిపై సూర్యుడు బహుశా ఈ నెల 22వ తేదీన ఉదయించవచ్చు. అప్పుడు సూర్య కిరణాలు పడేలా ప్రజ్ఞాన్ రోవర్ సోలార్ ప్యానెల్ను ఉంచాం. రిసీవర్ను ఆన్లోనే ఉంచాం’ అని ఇస్రో ఎక్స్లో పోస్టు చేసింది. ‘మరో టాస్క్ కోసం విజయవంతంగా ప్రజ్ఞాన్ రోవర్ మేలుకుంటుందని ఆశిస్తున్నాం. లేదంటే ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై ఎప్పటికీ భారత అంబాసిడర్గా నిలిచిపోతుంది’ అని తెలిపారు.
చంద్రుడిపై ఒక రోజు.. భూమిపై 14 రోజులకు సమానం. అందుకే ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ 14 రోజులపాటు పని చేసింది. ఇప్పుడు చంద్రుడిపై సూర్యుడు అస్తమించాడు. కాబట్టి, రోవర్ను స్లీప్ మోడ్లోకి పంపించారు. మళ్లీ 14 రోజుల తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ను మళ్లీ మేల్కోలుపుతామని ఇస్రో చెబుతున్నది. అనుకున్నట్టే ప్రజ్ఞాన్ రోవర్ మేలుకుంటే మరో 14 రోజులపాటు జాబిల్లిపై దాని అన్వేషణ కొనసాగుతుంది.
ఈ 14 రోజులపాటు పరిశోధనలో చంద్రుడిపై కీలక మూలకాలను ఇస్రో కనిపెట్టగలిగింది. సల్ఫర్ సహా అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, ఐరన్ వంటి ప్రధాన మూలకాలు చంద్రుడిపై ఉన్నట్టు చంద్రయాన్ 3 మిషన్ ద్వారా ఇస్రో తెలుసుకోగలిగింది.