
Raksha Bandhan 2023: మన సాంప్రదాయంలో రాఖీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ బంధాన్ని మరింత పెంచుకునేందుకు తమ సోదరులకు రాఖీలను కడతారు. ఈ రాఖీ రక్షాసూత్రమే కాకుండా ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.
ఈ పండుగ సందర్భంగా ప్రముఖ ఆన్లైన్ ట్యూటర్, పాట్నాకు చెందిన ఖాన్ సర్ (ఉపాధ్యాయుడు) రక్షా బంధన్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఊహించని స్పందన వచ్చింది. ఒక్కరూ కాదు.. ఇద్దరూ కాదు.. దాదాపు పదివేల మంది విద్యార్థుల తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడికి రాఖీ కట్టాడానికి వచ్చారు. దాదాపు 7,000 మంది బాలికలు అతని(ఉపాధ్యాయుడు ఖాన్) చేతికి రాఖీలు కట్టారు.
పాట్నాలోని ప్రముఖ విద్యావేత్త తన కోచింగ్ సెంటర్లో ఈ రక్షా బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వివిధ బ్యాచ్లకు చెందిన 10,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపు 7,000 మంది విద్యార్థినీలు తన చేతికి రాఖీలు కట్టారనీ, ఇలాంటిది గతంలో ఎన్నడూ జరగలేదని ఇది ప్రపంచ రికార్డు అని ఖాన్ సర్ (ఉపాధ్యాయుడు)పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు హాజరైనా.. విపరీతమైన రద్దీ కారణంగా అందరూ రాఖీలు కట్టలేకపోయారని తెలిపారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు.
ఓ ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక సంభాషణలో ఆయన మాట్లాడుతూ.. తనకు సొంత సోదరి లేదని వెల్లడించాడు. అందువల్ల తన విద్యార్ధినీలనే తన సోదరీమణులుగా భావిస్తాననీ, ప్రతి సంవత్సరం వారితోనే రాఖీలు కట్టించుకుంటాననిపేర్కొన్నారు. తన క్లాసులు వినడానికి వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్ధినీ, విద్యార్థులు వస్తున్నారని, తమ కుటుంబాన్ని వదిలి తన కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నారని ఖాన్ సర్ పంచుకున్నారు.
వారు తమ కుటుంబాలను దూరంగా ఉన్నామనే ఆ బాధను దూరంగా చేయడానికి తాను వారిని సోదరిమణులుగా చూసుకుంటాననీ, వారు విజయం సాధించడంలో, మంచి ఉద్యోగాలు సాధించడంలో తాను అనునిత్యం వారికి సహాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఖాన్ సర్ ప్రపంచంలోనే ఉత్తమ ఉపాధ్యాయుడు, గురువు, సోదరుడు అని కొనియాడారు. ఆయనను మించిన సోదరుడు లేడని చెప్పారు. కొంతమంది విద్యార్థులు తమ జీవితాంతం ఖాన్ సర్ కు రాఖీ కడుతామని తెలిపారు.