
India-Nepal: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే పలు కీలక అంశాలు చర్చకు వచ్చనట్టు సమాచారం. "మా బహుముఖ భాగస్వామ్యంపై విస్తృత చర్చలు ఎజెండాలో ఉన్నాయి" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. గతేడాది జులైలో ఐదోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేపాల్ ప్రధానమంత్రి దేవుబా విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ లో పర్యటిస్తున్నారు. తన ఉన్నత స్థాయిలో బృందంతో కలిసి చర్చల్లో పాల్గొన్నారు.
“భారత్-నేపాల్ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కలిసి పని చేస్తున్నాం. నేపాల్ ప్రధాని @narendramodi మరియు PM @SherBDeuba మధ్య సమావేశం ప్రారంభమైంది. మా బహుముఖ భాగస్వామ్యంపై విస్తృత చర్చలు ఎజెండాలో ఉన్నాయి' అని బాగ్చి ట్వీట్ చేశారు.
అంతకుముందు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. శుక్రవారం నాడు నేపాల్ ప్రధాని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లాతో దేశ రాజధానిలో సమావేశమయ్యారు. అంతకుముందు, ఆయన భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జేపీ నడ్డాను పార్టీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
“నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. భారతదేశం మరియు నేపాల్ కేవలం పొరుగు దేశాలే కాదు, మత, సాంస్కృతిక, భాషా మరియు చారిత్రక దృక్కోణాల నుండి కూడా ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నాయి” అని నడ్డా ఒక ట్వీట్లో తెలిపారు.
నేపాల్ నుండి చివరి దేశాధినేత/ప్రభుత్వ-స్థాయి పర్యటన మే 2019లో.. అప్పటి PM KP ఓలీ PM నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం భారత్ లో సందర్శించారు. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ 2018 ఆగస్టులో ఖాట్మండులో జరిగిన 4వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు కోసం నేపాల్ను సందర్శించారు. నేపాల్ పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే షేర్ బహదూర్ దేవుబాకు ప్రధాని మోడీ అభినందన సందేశం పంపారు. దీని తర్వాత 19 జూలై 2021న ఇరువురు నేతలు ఫోన్ లో సంభాషించుకున్నారు.
కాగా, షేర్ బహదూర్ దేవుబా ఏడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న నేపాలీ కాంగ్రెస్కు చెందిన అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. ప్రధానమంత్రిగా దేవుబాకు ఇది ఐదవ పదవీకాలం. అతని మొదటి పదవీకాలం సెప్టెంబర్ 1995 నుండి మార్చి 1997 వరకు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మరియు లేనప్పుడు ఆయన అనేక సార్లు భారతదేశాన్ని సందర్శించారు. ప్రధానమంత్రి హోదాలో ఇది అతని ఐదవ భారత పర్యటన, చివరి సందర్శన ఆగస్టు 2018లో భారత్ కు వచ్చారు.