కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండడం ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కరోనా ముప్పు తగ్గిందని అజాగ్రత్తగా ఉండొద్దని ఆయన ప్రజలకు సూచించారు.
న్యూఢిల్లీ:కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండడం ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కరోనా ముప్పు తగ్గిందని అజాగ్రత్తగా ఉండొద్దని ఆయన ప్రజలకు సూచించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోడీ ఆదివారం నాడు ప్రజలతో సంభాషించారు.ఈ నెల 21న ఒకే రోజు 86 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. వ్యాక్సిన్లు తీసుకోవడంలో భయాందోళనలను వీడాలని మోడీ ప్రజలను కోరారు.కరోనాకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడంలో చాలా మంది భారతీయులు కృషి చేశారన్నారు.దేశంలోని కష్టపడి పనిచేస్తున్న వైద్యులకు సెల్యూట్ చేస్తున్నానని మోడీ చెప్పారు.
సైన్స్ ను నమ్మాలని ఆయన కోరారు. శాస్త్రవేత్తలను నమ్మాలని ఆయన ప్రజలను కోరారు. చాలా మంది టీకా తీసుకొన్నారన్నారు. టీకాకు వ్యతిరేకంగా పుకార్లను నమ్మొద్దని ఆయన కోరారు.కరోనాపై యుద్దం కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో ఇటీవల కాలంలో అసాధారణమైన మైలురాయిని సాధించినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.మన్కి బాత్లో భాగంగా బేతుల్ జిల్లాల్లోని దులారియా గ్రామస్తులతో మోడీ మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తాను కూడ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నానని ఆయన చెప్పారు. తన తల్లికి వందేళ్లన్నారు. ఆమె కూడ కరోనా టీకాలు తీసుకొందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఒలంపిక్స్ గురించి మాట్లాడే సమయంలో మిల్కా సింగ్ ను మనం గుర్తు చేసుకొంటామన్నారు. అతన ఆసుపత్రిలో చేరిన సమయంలో అతనితో మాట్లాడినట్టుగా మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. టోక్యోలో జరిగే ఒలంపిక్ కు వెళ్లే ప్రతి అథ్లెట్ చాలా కష్టపడ్డాడన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి వారు అక్కడకు వెళ్తున్నారన్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ప్రవీణ్ జాదవ్ అత్యుత్తమ విలుకాడు అని ఆయన గుర్తు చేశారు. తల్లిదండ్రులు కూలీలైనా జాదవ్ మాత్రం టోక్యోలోని ఒలంపిక్స్ లో పాల్గొనబోతున్నారన్నారు.