
హనుమాన్ జయంతి (hanuman jayanti) వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని (hanuman statue ) మోడీ (narendra modi) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. హనుమాన్జీ 4 ధామ్ ప్రాజెక్ట్లో (hanumanji 4 dham project) భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం గుజరాత్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏప్రిల్ 18 నుంచి మోడీ గుజరాత్లో (gujarat) పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండవది. మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా.. ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు నెలకొల్పింది. సిమ్లాలోని జాఖూలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇందుకోసం మొత్తం 1500 టన్నుల కాంక్రీట్, ఇనుము, రాళ్ళు ఉపయోగించారు. బిగ్-బి అమితాబ్ బచ్చన్ అల్లుడు నందా నిర్మించిన హనుమాన్ విగ్రహం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు సంపాదించుకుంది. విగ్రహం స్థిరంగా ఉండేందుకు 178 అడుగుల లోతుతో పునాది వేశారు. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఉంది. లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.
అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బలం, ధైర్యం, సంయమనానికి ప్రతీక అయిన హనుమంతుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ పుత్రుడి దయతో ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలని, తెలివి తేటలు, విజ్ఞానంతో నిండి ఉండాలని మోడీ ఆకాంక్షించారు.