
ఆదివారం జరిగిన మన్కీబాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు పలు కీలక విషయాల గురించి ప్రస్తావిచారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. ఏఐ టెక్నాలజీని ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకుంటూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నరేంద్ర మోదీ సూచించారు. ఈ సందర్భంగా మోదీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా అభినందించారు.
ఇంతకీ ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడు.?
ఆదిలాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తొలసం కైలాష్ను మోదీ ప్రశంసలు కురిపించారు. గిరిజన భాషలను పరిరక్షించడంలో తమకు ఆయన సాయం చేశారని మోదీ ప్రశంసించారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారని చెప్పుకొచ్చారు.
భారత దేశం అంతరిక్ష రంగంలో ప్రతీ ఏటా పురోగతి సాధిస్తోందని మోదీ అన్నారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం భారత దేశానికి గర్వకారణం అని మోదీ ప్రశంసిచారు. అంతరిక్షశాస్త్ర సరిహద్దులను అధిగమించాలనే మన సంకల్పానికి ఇది చక్కటి నిదర్శనమని ఆయన అన్నారు. గడిచిన పదేళ్లలో భారత్ సుమారు 460 శాటిలైట్స్ను లాంచ్ చేసినట్లు తెలిపిన ప్రధాని అంతరిక్షంలో దేశంలో పురోగతి సాధిస్తోందని తెలిపారు.
చంద్రయాన్ విజయం దేశానికి ఎంతో గర్వకారణం అన్న మోదీ.. అంతరిక్ష రంగంపై యువత కూడా ఆసక్తి చూపుతోందని చెప్పుకొచ్చారు. అంతరిక్ష రంగంలో మహిళా శాస్త్రవేత్తలు భాగస్వామ్యం కావడం సంతోషమన్నారు. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరగడం ఇటీవల సాధించిన విజయాల్లో ఒకటన్నారు మోదీ. ఇక పారిస్లో జరిగిన ఏఐ సదస్సు గురించి కూడా మోదీ ప్రస్తావించారు.
కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించిందన్న ప్రధాని.. అంతరిక్షం లేదా ఏఐ అయినా భాగస్వామ్యం పెరుగుతోందని తెలిపారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక రోజు తన సోషల్ మీడియా ఖాతాను వారికే అంకిత చేస్తామని చెప్పుకొచ్చారు.