
PM Modi US Visit: భారత్, అమెరికాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలనీ, ఇరుదేశాలు ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం దోహదపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యానికి ఎలాంటి హద్దులేవనీ, ఆ ఆకాశం కూడా హద్దు కాదనన్నారు. శ్వేతసౌధంలో ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ప్రెసిడెంట్ బిడెన్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి హద్దుల్లేవు
"భారత్, అమెరికాల మధ్య భాగస్వామ్యానికి ఎలాంటి హద్దుల్లేవు. ఆకాశం కూడా మా భాగస్వామ్యానికి హద్దు కాదు. మా సంబంధాలకు అత్యంత ముఖ్యమైన మూలస్తంభం ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలే. 40 లక్షల మందికి పైగా భారతీయ సంతతికి చెందిన ప్రజలు అమెరికా అభివృద్ధికి సహకరిస్తున్నారు' అని ప్రధాని మోదీ అన్నారు. భారత్, అమెరికాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం దోహదపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
భారతీయ-అమెరికన్లు నిజమైన స్నేహితులని, వైట్హౌస్లో ఇంత పెద్ద సంఖ్యలో భారతీయులు ఉండటమే ఇందుకు నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు బెంగళూరు, అహ్మదాబాద్లలో కాన్సులేట్లను తెరవాలన్న అమెరికా నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు.
ఉగ్రవాదంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదం, రాడికలిజంపై పోరాటంలో భారత్, అమెరికా భుజం భుజం కలిపి నడుస్తున్నాయని అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి సంఘటిత చర్య అవసరమని తాము అంగీకరిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
భారత్-అమెరికా భాగస్వామ్యంతో వేలాది ఉద్యోగాలు
అమెరికాతో మన ఆర్థిక సంబంధాలు శరవేగంగా పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు రెట్టింపు అయి 191 బిలియన్ డాలర్లకు చేరుకుందనీ, ఇటు అమెరికాలోనూ.. అటు భారత్ లోనూ వేలాది ఉద్యోగాలను సృష్టించబడ్డాయని తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మా భాగస్వామ్యం ముఖ్యం
బిడెన్తో సంయుక్త ప్రకటన విడుదల చేసిన పిఎం మోడీ, వాణిజ్యం,పెట్టుబడులలో యుఎస్-ఇండియా భాగస్వామ్యం రెండు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ముఖ్యమని అన్నారు. నేడు అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిఅనీ, పెండింగ్లో ఉన్న వాణిజ్య సమస్యలను క్లియర్ చేసి, తాజాగా ప్రారంభించాలని తాము నిర్ణయించుకున్నామని అన్నారు.
కొత్త అధ్యాయం షూరూ
అమెరికా అధ్యక్షుడు బిడెన్తో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్-అమెరికా సంబంధాల చరిత్రలో ఈరోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. నేడు ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు, తీసుకున్న కీలక నిర్ణయాలు నూతన అధ్యాయానికి శ్రీకారం చూడుతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.