
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో కూర్చుని యూరప్ కంట్రీ స్వీడన్లోని కారును నడిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సహాయంతో ఆయన ఎరిక్సన్ స్టాల్లో ఈ ఫీట్ చేశారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో శనివారం ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఎరిక్సన్ స్టాల్లో రూపుదిద్దుకున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. స్వయంగా కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేశారు.
భారత్ ప్రపంచాన్ని నడుపుతున్నదని పేర్కొంటూ ఈ ఫొటో ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ 5జీ టెక్నాలజీ సహాయంతో ఢిల్లీ నుంచి యూరప్లోని కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారని వివరించారు.
యూరప్లోని స్వీడన్లో ఓ ఇండోర్ కోర్స్లో ఈ వాహనాన్ని ఉంచారు. దాన్ని నావిగేట్ చేయడనికి కంట్రోల్ సెటప్ను ఢిల్లీలోని ఎరిక్సన్ స్టాల్లో ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ ఆ సీటు పై కూర్చుని ఎదురుగా ఉన్న హ్యాండిల్ను, యాక్సెలేటర్, బ్రేక్లను యూజ్ చేస్తూ కారును డ్రైవ్ చేశారు.
ప్రధాని మోడీ ఈ రోజు ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5జీ సేవలను ప్రారంభించారు. మన దేశంలో 5జీ సేవల ఎదురుచూపులు ఎట్టకేలకు ముగిశాయి. దీపావళిలోపు ఈ సేవలు యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు. ఎయిర్టైల్, రిలయన్స్ జియో, క్వాల్కామ్ వంటి దిగ్గజ కంపెనీలు 5జీ సర్వీసులను డెమోన్స్ట్రేట్ చేశాయి.