
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ధరల పెరుగుదల నుంచి తప్పించుకునేందుకు ఏపీలోని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉంటున్న ప్రజలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు సమీపంలో నివసించే ప్రజలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి పెద్ద మొత్తంగా పెట్రోల్, డీజిల్ ను కొనుగోలు చేస్తున్నారు.
ఇంధన ధరలు ఇటీవల కాలంలో తరచూ పెరుగుతున్నాయి. బుధవారం (ఏప్రిల్ 6, 2022) నాటికి పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్పై 80 పైసలు చొప్పున పెరిగాయి. వరుసగా 16 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది 14వ సారి. గత 16 రోజుల్లో లీటరు పెట్రోల్ పై ధర రూ.10 పెరిగింది.
ఈ పెరిగిన ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడానికి ఏపీ సరిహద్దుల్లో నివసించే వాహన వినియోగదారులు, ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ట్రక్కులు, ట్యాక్సీలు,ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు తరచుగా పెట్రోల్, డీజిల్ కోసం తమిళనాడు, కర్ణాటకకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం ఏపీ- తమిళనాడు సరిహద్దు ప్రజలు లీటర్ పెట్రోల్పై కనీసం రూ. 9-10, లీటర్ డీజిల్పై రూ. 5-6 ఆదా చేయవచ్చు. కర్ణాటక సరిహద్దుకు సమీపంలో నివసించే ప్రజలు పెట్రోల్పై రూ.10-11, డీజిల్పై రూ.12 ఆదా చేసుకోవచ్చు.
రాష్ట్రంలో పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగిపోతుండడంతో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్కువ ధరకు ట్యాంకులు నింపుకునేందుకు వెతుకుతున్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఫ్యూయల్ అవుట్లెట్లకు పలువురు పెద్దపీట వేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇంధన ట్యాంకులు నింపడానికి సుదూర ప్రాంతానికి వెళ్లే ట్రక్కులు, బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. దీంతో ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో విక్రయాలు పడిపోతున్నాయి.
ప్రస్తుతం చిత్తూరు జిల్లా సరిహద్దు మండలాల్లో పెట్రోల్ లీటరుకు రూ.121.24 (ఏప్రిల్ 5 నాటికి) కు లభిస్తోంది. అయితే కర్ణాటక, తమిళనాడులోని ఔట్లెట్లలో రూ.109.15 నుంచి రూ.110.97లకు మధ్య విక్రయిస్తున్నారు. అదే విధంగా డీజిల్ ఇక్కడ లీటరుకు రూ. 106.77కు దొరుకుతోంది. అయితే కర్ణాటక, తమిళనాడులో బంకుల్లో రూ. 93.01 నుంచి రూ. 101.05 మధ్యలో లభిస్తోంది. దీంతో వెంకటగిరి కోట మండలం, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కర్ణాటక సరిహద్దు పట్టణాల్లోని ఇంధన విక్రయ కేంద్రాలకు తరలివస్తుండగా, సత్యవేడు, కుప్పం, నాగలాపురం, నగరి, విజయకుమార్, పరిసర ప్రాంతాల ప్రజలు ఇంధనం కోసం తమిళనాడు సరిహద్దులు దాటుతున్నారు.
సరిహద్దులకు అవతలి వైపున ఉన్న కొన్ని ఫ్యూయల్ అవుట్లెట్లు పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. AP ప్రజలు తమ బంక్లో వాహనాల్లో పెట్రోల్, డిజీల్ నింపుకోవడం వల్ల పొందే లాభాలను వారు హైలైట్ చేస్తున్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని కొన్ని ఔట్లెట్లు ఏపీలోని సమీప పట్టణాలు, గ్రామాల్లో ధరల వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నాయి. అయితే కాట్పాడిలోని ఒక స్టేషన్ 100 లీటర్ల డీజిల్ కొనుగోలు చేసే వారికి 1 కిలోల బాస్మతి బియ్యాన్ని కూడా అందిస్తోంది. ఇది ఆఫర్ సుదూర ప్రాంతాలకు వెళ్లే ట్రక్కుల దృష్టిని ఆకర్శిస్తోంది.