ఆ మహిళా ప్రయాణికురాలిపై నేను మూత్రం పోయలేదు.. ఆమెనే విసర్జించుకుంది.. ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో ఘటనపై నిందితుడు

By Mahesh KFirst Published Jan 13, 2023, 5:23 PM IST
Highlights

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి మహిళపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఆరోపణలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. తాజగా, ఆయన ఢిల్లీ కోర్టుకు ఇందుకు విరుద్ధమైన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాను అసలు ఆ మహిళపై మూత్రం పోయలేదని, ఆమెనే మూత్రం విసర్జించుకుందని అన్నారు.
 

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఏడు వారాల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసులో నిందితుడైన మాజీ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటీవ్ శంకర్ మిశ్రా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తన తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోయలేదని, ఆమెనే పోసుకుందని ఢిల్లీ కోర్టుకు తెలిపారు.

శంకర్ మిశ్రాను పోలీసు కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసుల అప్లికేషన్ మేరకు ఢిల్లీలోని సెషన్స్ కోర్టు నిందితుడికి నోటీసు పంపింది. ఇందుకు సమాధానంగా శంకర్ మిశ్రా పై వ్యాఖ్యలు చేశారు. అతడిని పోలీసు కస్టడీకి పంపడానికి కోర్టు నిరాకరించింది. అయితే, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు శనివారం పంపింది.

తనకు బెయిల్ కావాలని నిందితుడు దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు నాలుగు రోజుల తర్వాత డిస్మిస్ చేసింది. అతనిపై ఉన్న ఆరోపణలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది.

Also Read: వామ్మో.. సెకనుకు 6000 మీటర్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తున్న 130 అడుగుల గ్రహశకలం

నిందితుడి ప్రవర్తన ఏ మహిళ అయినా ఇబ్బందిపడేలా ఉన్నదని, అతని వ్యవహారం పౌరులను కలత చెందించిందని న్యాయమూర్తు బుధవారం తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే వరకు అతను పోలీసులకు దొరకకుండా ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ నిందితుడిపై ఫైర అయింది. 

బెయిల్ దరఖాస్తు సందర్భంగా మిశ్రా తరఫు న్యాయవాది వాదిస్తూ శంకర్ మిశ్రా తాజా వ్యాఖ్యలను పేర్కొనలేదు. మిశ్రా అసలు ఆ మహిళపై మూత్రం విసర్జించనే లేదని వాదించలేదు. కానీ, ఆయన చర్యలు కామ వాంఛతోనో లేదా.. ఒక మహిళను అగౌరవపరచాలనో మాత్రం చేసినవి కాదని తెలిపారు.

click me!