భార్యతో ఫోన్‌: పరోటా గొంతులో ఇరుక్కుని నవవరుడు మృతి

By Siva KodatiFirst Published Jul 5, 2019, 9:26 AM IST
Highlights

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది.. పరోటా గొంతులో చిక్కుకుని నవవరుడు మరణించాడు

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది.. పరోటా గొంతులో చిక్కుకుని నవవరుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే...పుదుచ్చేరి కరువడి కుప్పం భారతీనగర్‌కు చెందిన పురుషోత్తమన్ తిరుమాంబాక్కంలోని కార్లషోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతనికి షణ్ముగ సుందరి అనే యువతితో 6 నెలల క్రితం వివాహమైంది. షణ్ముగ సుందరి కొద్దిరోజుల క్రితం తిరునెల్వేలిలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పురుషోత్తమన్ బుధవారం రాత్రి పరోటా కొనుక్కుని వచ్చి తింటున్నాడు.

అదే సమయంలో భార్య ఫోన్ చేయడంతో.. కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుతూ పరోటా తింటున్నాడు. ఈ సమయంలో చిన్న ముక్క గొంతులో చిక్కుకోవడంతో మాట్లాడేందుకు వీలుకాలేదు.

ఎంతసేపటికి భర్తవైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో షణ్ముగ సుందరి ముత్యాలపేటలోని బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే భారతీనగర్‌లోని పురుషోత్తమన్ ఇంటికి వెళ్లారు.

తలుపులు గడియపెట్టి వుండటంతో ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ స్పృహతప్పి ఉన్న పురుషోత్తమన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. పరోటా గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక పురుషోత్తమన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

click me!