Owaisi asks EC: ఇంటర్నెట్ లేదే..? డిజిట‌ల్ ప్ర‌చారం ఎలా? ఈసీ ని ప్ర‌శ్నించిన అసదుద్దీన్ ఒవైసీ

Published : Jan 09, 2022, 02:15 AM IST
Owaisi asks EC: ఇంటర్నెట్ లేదే..?  డిజిట‌ల్ ప్ర‌చారం ఎలా? ఈసీ ని ప్ర‌శ్నించిన అసదుద్దీన్ ఒవైసీ

సారాంశం

Owaisi asks EC: కేంద్ర ఎన్నికల సంఘం  5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. క‌రోనా దృష్టిలో  పెట్టుకుని.. డిజిట‌ల్ ప్ర‌చారం చేయాలని ఎన్నిక‌ల సంఘం రాజ‌కీయ పార్టీల‌కు సూచించింది. ఈ నిర్ణ‌యంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ త‌న‌దైన శైలిలో స్పందించారు.  ఎన్నికల సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని,  అల్లా దయతో తాము సర్వశక్తులు ఒడ్డి ప్ర‌చారం సాగిస్తామని అన్నారు.  కానీ.. ఇంట‌ర్నెటే లేదే.. ప్ర‌చారమెలా చేయాల‌ని  ఈసీ ని ప్ర‌శ్నించారు అసదుద్దీన్ ఒవైసీ.   

Owaisi asks EC: కేంద్ర ఎన్నికల సంఘం  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా విజృంభన‌, కేసుల పెరుగుద‌ల నేపథ్యంలో ఈ నెల 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలు, ఇతర ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఈ నెల 15 తర్వాత పరిస్థితిని బ‌ట్టి ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపింది. అయితే.. అప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయ పార్టీలు డిజిటల్ ప్ర‌చారం (సోషల్ మీడియా) చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. 

ఈ నిర్ణ‌యంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ త‌న‌దైన శైలిలో స్పందించారు.  ఎన్నికల సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని,  అల్లా దయతో తాము సర్వశక్తులు ఒడ్డి ప్ర‌చారం సాగిస్తామని అన్నారు.  కానీ.. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను మరోసారి సమీక్షిస్తే బాగుంటుంద‌ని ఆశించారు.  భార‌త్ లో డిజిటల్ ప్ర‌చారం ఎలా సాధ్య‌ప‌డుతుందో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని  ఒవైసీ సూచించారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్ర‌మైన యూపీలో ఇంటర్నెట్ వినియోగం ఎలా ఉందో  గమనించాలని తెలిపారు.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. ఉత్త‌రప్ర‌దేశ్ లో  ప్రతి 100 మందిలో కేవలం 39 మందే మాత్ర‌మే  ఇంటర్నెట్ సౌక‌ర్యం ఉంద‌ని తెలిపారు. అత్యంత తక్కువ  ఇంటర్నెట్ వినియోగించే ప్రాంతాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కూడా ఒక‌ట‌ని  వివరించారు. అలాగే.. ఎన్ఎస్ఎస్ రిపోర్టు ప్ర‌కారం..  ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు ఉన్న గృహాలు 4 శాతం, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారి శాతం 11 మాత్రమేనని తెలిపారు.  UPలోని ధనవంతులలో 19% మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండ‌గా.. పేదలలో కేవలం 6% మాత్రమే ఉంద‌ని  తెలిపారు. ఉత్తరప్రదేశ్ పట్టణ పాంతాల్లో 50% మహిళలు ఎప్పుడూ ఇంటర్నెట్‌ని ఉపయోగించలేదనీ, అలాగే గ్రామీణ ప్రాంతంలోని 76% మహిళలు ఇంటర్నెట్‌ను ఉపయోగించలేదని  ఒవైసీ వివరించారు.

అలాగే..  పట్టణ ప్రాంతంలో కేవలం 54% మంది పురుషులు మాత్రమే కనీసం ఒక్కసారైనా ఇంటర్నెట్‌ని ఉపయోగించారని తెలిపారు.  కేవలం 46.5% మంది మహిళలు మాత్రమే తమ సొంత అవసరాల కోసం మొబైల్ ఫోన్ కలిగి ఉన్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రచారం నిర్వహించడం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని నిల‌దీశారు. 

 ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ సీట్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. గోవాలోని 40, పంజాబ్ లో 117, యూపీలో 403, మణిపూర్ లో 28, ఉత్తరాఖండ్ లోని 70 సీట్లు ఉన్నాయి. వీటికి వివిధ దశల్లో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. 

కోవిడ్ పరిస్ధితుల దృష్ట్యా అభ్యర్ధులకు ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. పోలింగ్ బూత్ ల సంఖ్య‌ను పెంచిన‌ట్టు తెలిపింది. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 18..34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 24.5 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

కేరళంకు కొత్త సీఎం.. ఎవరీ VD సతీశన్ | Keralam New CM VD Satheeshan story | Asianet News Telugu
Kerala CM Designate VD Satheesan: కేరళ సీఎం గా వి.డి సతీసన్ సంబరాల్లో కార్యకర్తలు | Asianet Telugu