కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చసాగుతున్న తరుణంలో మరో అంశం కలకలం రేపుతోంది
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చసాగుతున్న తరుణంలో మరో అంశం కలకలం రేపుతోంది.
ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక పరిస్ధితుల అనంతరం పెద్ద ఎత్తున రైతులు కనిపించకుండా పోయారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు పంజాబ్ హూమన్ రైట్స్ కమీషన్ శనివారం చేసిన ఓ ప్రకటన వివాదాస్పదంగా మారింది.
దీని ప్రకారం.. జనవరి 26 అనంతరం రాష్ట్రానికి చెందిన చాలామంది రైతు నిరసన కారులు అదృశ్యమయ్యారు. ఢిల్లీ హింసలో పాల్గొన్న దాదాపు 100 మంది రైతులు నాలుగు రోజులుగా కనిపించడంలేదని ఈ సంస్థ పేర్కొంది
Also Read:రైతులకు ఊరట.. ఏడాది పాటు సాగు చట్టాలు నిలిపివేత: మోడీ ప్రకటన
ఈ మేరకు పంజాబ్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 12 మంది రైతులు అదృశ్యమైనట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ కేసు కూడా నమోదైందని కమీషన్ తన నివేదికలో పేర్కొంది.
ముఖ్యంగా ఎర్రకోటపై జెండా ఎగరేసిన వారే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారని వివరించింది. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న 200 మంది రైతులపై కేంద్ర ప్రభుత్వం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
పలువురిపై దేశద్రోహ కేసు కూడా నమోదు చేసింది. అయితే కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని పలు సంఘాలకు చెందిన ప్రముఖులు నిర్ణయించారు. ఇలాంటి పరిస్ధితుల్లో పంజాబ్ హ్యూమన్ రైట్స్ కమీషన్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.