ఆర్కెస్ట్రాలో పాడుతూ.. అమ్మాయిల మనసు దోచాడు...నాలుగు రాష్ట్రాల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరికి..

By SumaBala BukkaFirst Published Dec 2, 2022, 9:45 AM IST
Highlights

పాటలు పాడుతూ ముగ్గులోకి దించాడు.. ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్ చేశాడు. కానీ చివరికి రైల్వేస్టేషన్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. 

బీహార్ : మధురమైన గాత్రంతో.. అద్భుతంగా పాడేవారిని చాలామంది అభిమానిస్తారు. ముఖ్యంగా మహిళలు ఆ పాటలకు ఫిదా అయిపోతారు. ఆగాయకుడితో ప్రేమలో పడతారు. దీన్ని అలుసుగా తీసుకున్నాడో ఆర్కెస్ట్రా సింగర్. తన పాటలకు అభిమానులైన మహిళలను వంచించాడు. గాత్ర శుద్ధే కానీ, బుర్ర శుద్ధిలేని ఆ సింగర్  యువతులు, మహిళలకు మాయ మాటలు చెబుతూ మోసాలకు దిగాడు. ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో.. ఆరు వివాహాలు చేసుకున్నాడు. అయితే ఏ మోసం అయినా ఎన్ని రోజులు ఆగదు కదా.. అలాగూ ఇతని వ్యవహారము బయటపడింది. ఓ రోజు  రైల్వేస్టేషన్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని బర్హత్ పరిధి జవతారి గ్రామానికి చెందిన చోటు కుమార్ ఆర్కెస్ట్రా సింగర్. అతనికి పెళ్లయి.. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. చోటూకు సంగీత పరిజ్ఞానం ఉంది, చక్కగా పాడతాడు. దీంతో పాటలు పాడడాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతుండేవాడు. అతని గానానికి ఎంతోమంది అభిమానులు అయ్యారు. ముఖ్యంగా అతని అభిమానుల్లో అమ్మాయిలు ఎక్కువగా ఉండేవారు. ఈ క్రమంలోనే అతని బుర్రలో చెడు బుద్ధి పుట్టింది. 

షాకింగ్.. 13యేళ్ల బాలికపై క్లాస్ రూంలో తోటి విద్యార్థుల అత్యాచారం.. ఇద్దరు మైనర్లు అరెస్ట్...

వృత్తి రీత్యా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ పాటలు పాడే క్రమంలో అక్కడ పరిచయమైన యువతులు, మహిళలకు ఎరవేయడం మొదలుపెట్టాడు. వారితో ప్రేమ పాఠాలు మొదలు పెట్టాడు. తన మాటలతో మాయ చేసి నమ్మించేవాడు. కొంతమందిని పెళ్ళికూడా చేసుకున్నాడు. అలా  బీహార్ చుట్టుపక్కల నాలుగు రాష్ట్రాల్లో ఆరుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇతని మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇతను తన మోసానికి 2018 లోనే తెరతీశాడు.

మంజు అనే మహిళను 2018లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమెతో మూడేళ్ల పాటు బాగానే ఉన్న చోటూ ఏడాదిన్నర క్రితం..  మందులు తెచ్చుకుంటానని చెప్పి  ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అప్పటి నుంచి తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళలేదు. భర్త కోసం అన్ని చోట్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో..ఎదురు చూడడం మొదలుపెట్టింది మంజు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మంజు సోదరుడు కలకత్తా వెళ్లేందుకు జాముయి రైల్వే స్టేషన్ కి చేరుకున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా చోటూ అక్కడ కనిపించాడు. 

తన బావను పలకరిద్దాం అనుకునేలోపు.. అతనితో పాటు మరో మహిళ కూడా కనిపించింది. అది చూసిన మంజు సోదరుడు వికాస్  షాక్ అయ్యాడు. దీంతో బావ, తన సోదరిని మోసం చేశాడని గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. వికాస్ చెప్పిన వివరాల మేరకు చోటును అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను తన చేసిన నేరాలను అంగీకరించాడు. విచారణలోనే  నాలుగు రాష్ట్రాల్లో ఆరు పెళ్లి చేసుకున్నట్లు తేలింది. అయితే, ఇప్పటి వరకు మిగతా నలుగురు భార్యలు నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 

click me!