
Punjab: పంజాబ్ లో హత్యల పరంపర కొనసాగడం..దేశవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తుంది. గత 21 రోజుల్లోనే 19 హత్యలు జరగడం సంచలనంగా మారింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హత్యాకాండ ప్రారంభమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆప్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరస్థులకు అప్పగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వివాదానికి తెరలేపాయి.
పంజాబ్లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయనీ, అయినా .. అవిఏవీ పట్టనట్టు.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పంజాబ్ సీఎం బీజీబీజీగా ఉన్నారనీ, సగటున, రోజుకు మూడు నుండి నాలుగు హత్యలు జరుగుతున్నాయనీ, ప్రజలు భయాందోళనలో ఉన్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. ఎస్ఎడి నాయకుడు దల్జీత్సింగ్ చీమా కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు.
పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నుంచి పంజాబీల మనస్సుల్లో అభద్రతా భావం నెలకొందని విమర్శించారు. తక్షణమే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను అభ్యర్థిస్తున్నానని అన్నారు. ప్రచార కసరత్తుల్లో బిజీగా ఉండకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సీఎం మాన్ కు దల్జీత్ చీమా చురకులంటించారు. హత్యకుగురైన వారిలో క్రీడాకారులే ఎక్కువగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఈ హత్యల వెనుక హస్తం ఎవరిది? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంటూ చర్చలు సాగుతున్నాయి.
ఇటీవల నివేదించబడిన కేసుల ప్రాథమిక దర్యాప్తులో స్థానిక ముఠాలకు నిధులు, సహాయం చేస్తున్న ఖలిస్తానీ మద్దతుదారులతో పాటు అంతర్-రాష్ట్ర, అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ల మధ్య అనుబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. పంజాబ్ గ్యాంగ్లకు హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్లు సహాయం చేస్తున్నాయి, వీరు కబడ్డీ ఆటగాళ్లను చంపడమే కాకుండా పంజాబీ సినీ నటులు మరియు గాయకుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్న హత్యలు, మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ల కోసం కబడ్డీ టోర్నమెంట్లను నియంత్రించడానికి క్రిమినల్ ముఠాలు ప్రయత్నిస్తున్నాయని స్పష్టమైంది.
లారెన్స్ బిష్ణోయ్, సందీప్ అలియాస్ కాలా జాతేడి, వీరేంద్ర ప్రతాప్ అలియాస్ కాలా రాణా, సుబే గుర్జార్ నేతృత్వంలోని ముఠాల కూటమి వెలుగులోకి వచ్చింది. కెనడా కేంద్రంగా ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్లో లక్ష్యంగా చేసుకుని హత్యలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలింది. కబడ్డీ ప్లేయర్ సందీప్ నంగల్ అంబియా హత్యకేసులో అమృత్సర్కు చెందిన ఒంటారియోలోని బ్రాంప్టన్ నివాసి భింద్రన్వాలే మద్దతుదారుడు స్నోవర్ ధిల్లాన్ ప్రధాన నిందితుడని పోలీసులు నిర్థారించారు.ఆర్మీ మిలటరీ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. రాష్ట్ర గ్యాంగ్స్టర్ల వల్ల దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది.
యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
పోలీసుల నివేదికలతో ఆప్ సర్కార్ అప్రమత్తమైంది. గ్యాంగ్స్టర్ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యూనిట్ లో అంతర్గభాగం పని చేస్తుంది.దీనికి ADGP స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ఇటీవల జరిగిన హత్యలను తీవ్రంగా పరిగణించాలనీ, శాంతిభద్రతలను నియంత్రించాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి భగవంత్ మాన్. చట్టం ప్రకారం జవాబుదారీగా ఉన్నందున మీ అధికార పరిధిలో ఏదైనా శాంతిభద్రత ఉల్లంఘనకు వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తానని భగవంత్ మాన్ అన్నారు.
పంజాబ్ పోలీసు క్రైమ్ వింగ్ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలోని రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులపై వారిని ఉపయోగించుకోవడానికి గ్యాంగ్స్టర్లను ప్రోత్సహిస్తున్నారని తెలిపింది. రాజకీయ అండదండలు లేకుండా ముఠాలు మనుగడ సాగించవని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్తో సహా అన్ని రాజకీయ పార్టీల నేతలకు గ్యాంగ్స్టర్లతో సంబంధాలున్నాయంటూ పరస్పరం ఆరోపణలు చేశారు.
గ్యాంగ్స్టర్ ప్రభ్జిందర్ డింపీకి అకాలీదళ్ నాయకుడు (అమృత్సర్) సిమ్రంజీత్ సింగ్ మాన్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. డింపీ తర్వాత ముఖ్తార్ అన్సారీతో కలిసి పనిచేశారు. మరో గ్యాంగ్స్టర్ జస్విందర్ రాకీ 2012 ఎన్నికల్లో పోటీ చేసి అకాలీదళ్కు చెందిన షేర్ సింగ్ ఘుబాయాకు బహిరంగంగా మద్దతు ఇచ్చాడని, 2016లో హత్యకు గురయ్యాడని తెలిపారు. గ్యాంగ్స్టర్గా మారిన సామాజిక కార్యకర్త లఖా సిధాన ఒకప్పుడు అకాలీదళ్ నాయకుడు సికందర్ సింగ్ మలుకాకు మద్దతుదారు. అతను రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ నాయకుడు మన్ప్రీత్ సింగ్ బాదల్తో కలిసి పనిచేశారని ఆరోపణలు వున్నాయి.
గ్యాంగ్స్టర్ భగవాన్పురియాకు కాంగ్రెస్ నాయకుడు, అప్పటి జైళ్ల శాఖ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావాతో సంబంధాలు ఉన్నాయని అకాలీదళ్ నాయకుడు విక్రమ్ సింగ్ మజ్థియా కూడా ఆరోపించారు. అనంతరం మంత్రి ఆరోపణలను తిప్పికొట్టారు. కెప్టెన్ అమ్రీందర్ సింగ్కు 2017లో పేరుమోసిన గ్యాంగ్స్టర్ హర్జిందర్ సింగ్తో సంబంధాలు ఉన్నాయని అకాలీదళ్ సుప్రీమో సుఖ్బీర్ బాదల్ కూడా ఆరోపించారు.