
కేంద్రంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా పలు ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్న సంగతి తెలసిందే. ప్రతిపక్షాల కూటమికి గతంలో ఉన్న యూపీఏకు బదులుగా I.N.D.I.A. అనే పేరును కూడా నిర్ణయించారు. బెంగళూరులో జరిగిన విపక్ష కూటమి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. INDIA కూటమి అంటే.. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ అని అర్థంగా తెలిపారు. అయితే విపక్షాల కూటమిలోని పలువురు నేతలకు.. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నవారు INDIA కూటమి ఫుల్ ఫామ్ తెలియదని చెప్పడం గమనార్హం.
ఈ జాబితాలో కాంగ్రెస్ నేతలు అఖిలేష్ ప్రసాద్ సింగ్, ప్రమోద్ తివారీ, నాసిర్ హుస్సేన్, సమాజ్వాదీ పార్టీ నేత ఎస్టీ హసన్, ఆప్ నేత హర్బజన్ సింగ్, సీపీఐ నేత బినయ్ విశ్వమ్లు ఉణ్నారు. అయితే వీరిలో కొందరు ఇండియా.. అంటే దేశంలో బీజేపీ ఓడించేందుకు ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఒకరిద్దరు అయితే ఈ ప్రశ్న అడిగిన రిపోర్టర్పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కానీ ఫుల్ ఫామ్ మాత్రం చెప్పలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో విపక్ష పార్టీల నేతలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇదిలా ఉంటే, విపక్ష కూటమిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, సమాజ్వాద్ పార్టీ, డీఎంకే, సీపీఎం, సీపీఐతో సహా 26 పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు రెండు సార్లు సమావేశం పాట్నాలో జరగగా.. రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే.. ‘‘మేము కలిసి వివిధ అంశాలపై చర్చించాము. ఈ రోజు ఆమోదించబడిన తీర్మానానికి అందరూ ఒకే స్వరంతో మద్దతు ఇచ్చారు. మా కూటమిని ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (INDIA) అని పిలుస్తాము’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంయుక్త విలేకరుల సమావేశంలో అన్నారు.