PFI: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మరోసారి ఎనిమిది రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యాలయాలు, సంబంధిత వ్యక్తుల ఇండ్లపై దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే 170 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది.
Operation Octopus 2.0: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అగ్ర నాయకులు, కార్యకర్తలు, సిబ్బందికి సంబంధించి ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మరోసారి దాడులు నిర్వహించింది. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ లను అదుపులోకి తీసుకోగా, తాజా దాడుల్లో పీఎఫ్ఐకి చెందిన దాదాపు 170 మందిని అదుపులోకి తీసుకుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మంగళవారం ఎనిమిది రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో రెండవ రౌండ్ దాడులను ప్రారంభించింది.
కాగా, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై ఆపరేషన్ ఆక్టోపస్ కింద ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి పీఎఫ్ఐ సభ్యులపై దాడులు నిర్వహిస్తోంది. మంగళవారం ఢిల్లీ, కర్ణాటక, అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. ఈ ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల 170 మందికి పైగా పీఎఫ్ఐ సభ్యులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి.
పీఎఫ్ఐ విషయంలో ఎన్ఐఏ దాడుల వివరాలు ఇలా ఉన్నాయి..
సెప్టెంబర్ 22న, ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, మణిపూర్ వంటి 15 రాష్ట్రాల్లోని 93 ప్రదేశాలలో పీఎఫ్ఐ కేసు నేపథ్యంలో సోదాలు నిర్వహించాయి. వివిధ కేసుల్లో కనీసం 106 మంది పీఎఫ్ఐ సభ్యులు, దానితో సంబంధ కలిగిన అనుచరులను ఈడీ, ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసు సంయుక్త బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.