
రోజురోజుకు మానవుడు శాస్ర్త సాంకేతిక వైపు పరుగులు తీస్తున్నప్పటికీ.. అనేక మూఢనమ్మకాలు వెనక్కు లాగుతూనే ఉన్నాయి. వాటిలో చేతబడి కూడా ఒకటి. దీనినే చిల్లంగి, చేతబడి, బాణామతి అని పిలుస్తారు. చదువులు సమాజాన్ని మారుస్తాయని అంటారు. కానీ ఇప్పటికీ చదువుకున్నవారు కూడా మూఢనమ్మకాలను నమ్ముతారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి.. దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటననే ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు చేతబడి చేశారనే అనుమానంతో భార్యభర్తలను అత్యంత దారుణంగా హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దైతరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ జుముకిపాటియా సాహి గ్రామంలో ఆదివారం ఉదయం దంపతుల హత్య కలకలం రేపింది. వారి ఇద్దరి మృతదేహాలు రక్తం మడుగులో తడిసి కనిపించాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు .. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కియోంఝర్ పోలీసు సూపరింటెండెంట్ మిత్రభాను మహపాత్ర మాట్లాడుతూ.. ఈ హత్యల వెనుక మంత్రవిద్య ఉందనే అనుమానం కనిపిస్తోందని అన్నారు. హత్యకు పాల్పడిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని, త్వరలోనే మిగితా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. శనివారం రాత్రి తన తండ్రి బహదా ముర్ము , తన తల్లి ధని తమ గది బయట పడుకున్నారని, తాను గదిలో నిద్రించానని మృతుల దంపతుల కుమార్తె సింగో తెలిపింది. అరుపులు విని బయటకు వచ్చి చూడగా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే జరిగిన విషయాన్ని ఆమె తన మామ కిషన్ మరాండీకి ఫోన్ చేసి తెలియజేశాననీ తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.