ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించింది.. ఓ నర్సు విజయగాథ..

By AN TeluguFirst Published May 13, 2021, 3:26 PM IST
Highlights

చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటినుంచి ఆమె ఒక ఊపిరితిత్తితోనే జీవిస్తోంది. అయినప్పటికీ ఆ విషయం ఆమెకు తెలియదు. 

చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటినుంచి ఆమె ఒక ఊపిరితిత్తితోనే జీవిస్తోంది. అయినప్పటికీ ఆ విషయం ఆమెకు తెలియదు. 

2014లో చెస్ట్ ఎక్స్ రే తీసుకున్నప్పుడు తనకు ఒకటే ఊపిరితిత్తి మాత్రమే ఉందన్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఆమెకు 39 సంవత్సరాలు. నర్స్ గా పనిచేస్తుంది. ఇటీవల ఆమెకు కరోనా సోకింది. ఆ మహమ్మారితో ఒక్క ఊపిరితిత్తి తోనే పోరాడి ఆమె విజయం సాధించింది.

మధ్యప్రదేశ్ కు చెందిన  ఆ నర్సు పేరు ప్రఫులిత్ పీటర్. టికామ్‌గఢ్  ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో పనిచేస్తున్న సమయంలో ఆమెకు వైరస్ సంక్రమించింది. దీంతో కుటుంబసభ్యులు భయపడ్డారు.

కరోనా తొలుత ఊపిరితిత్తుల పైనే ప్రభావం చూపుతుందని తెలిసి భయపడిపోయారు. ఆమెకు ఒకటే ఊపిరితిత్తి ఉండటంతో కంగారుపడ్డారు. అయితే 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ఆమె వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

కరోనా నుంచి కోలుకున్న ఆమె అదెలా సాధ్యమైందో వివరించింది. తనకు కరోనా సోకినప్పటి నుంచి తాను ఏ దశలోనూ ధైర్యం కోల్పోలేదని పేర్కొంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు క్రమం తప్పకుండా చేయడంతోపాటు, ఊపిరితిత్తులకు మేలుచేసేందుకు బెలూన్లు  ఊదేదానినని వివరించింది. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. దీనికితోడు ధైర్యమే తనను గెలిపించిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది. 
 

click me!